రాజమండ్రి జైలుకు చేరిన కోర్ట్ ఆర్డర్ కాపీ .. కాసేపట్లో విడుదల కానున్న చంద్రబాబు , వాట్ నెక్ట్స్
చంద్రబాబు కొద్దిసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నారు . దాదాపు రెండు నెలల తర్వాత చంద్రబాబు బయటకు వస్తుండటంతో ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు చేరుకుంటున్నారు.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. అనారోగ్య కారణాలతో ఆయనకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు కొద్దిసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. దాదాపు రెండు నెలల తర్వాత చంద్రబాబు బయటకు వస్తుండటంతో ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు చేరుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
మరోవైపు.. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఆర్డర్ కాపీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకుంది. ఇందులోని కండీషన్స్ను జైలు అధికారులు చంద్రబాబుకు వివరించనున్నారు. ఆపై ఆయనను విడుదల చేయనున్నారు. రాజమండ్రి నుంచి రోడ్డు మార్గంలో చంద్రబాబు విజయవాడ చేరుకోనున్నారు. అనంతరం రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకుని, అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుంటారని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చంద్రబాబు చికిత్స తీసుకోనున్నారు.
ALso Read: Chandrababu: చంద్రబాబుకు బెయిల్ ..కండిషన్స్ ఇవే !!
అంతకుముందు చంద్రబాబు చర్య, హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని.. అలాగే ఆయన కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాల్సి వుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ధర్మాసనం చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంద్రబాబు అభిమానులు, టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.