వకీల్ సాబ్ను ఎందుకు అడ్డుకున్నారు.. మేం వ్యాపారాలు చేసుకోకూడదా: జగన్పై బాబు నిప్పులు
పవన్ కల్యాణ్ సినిమాను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
పవన్ కల్యాణ్ సినిమాను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
పవన్ సినిమాకు ఎందుకు ఇబ్బందులు పెట్టారని నిలదీశారు. నాకు పాల వ్యాపారం వుందని.. గుజరాత్ నుంచి మరో కంపెనీని తెచ్చారని చంద్రబాబు ఆరోపించారు. ఎవరూ వ్యాపారాలు చేసుకోకూడదా అన్న ఆయన.. నరేగా పనుల్లో రోడ్డు వేసిన సామాన్యులు ఏం పాపం చేశారని నిలదీశారు. తిరుపతిలో వైసీపీ ఓడిపోతేనే జగన్ కిందకు దిగుతారని వ్యాఖ్యానించారు.
రెండేళ్లుగా రాష్ట్రానికి వైసీపీ ఏం చేసిందో చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజల ఆదాయం తగ్గింది.. ఖర్చులు పెరిగాయని తెలిపారు. కేంద్రం మెడలువంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ నమ్మించాడని, పాండిచ్చేరిలో ప్రత్యేక హోదా ఇస్తామని చెబితే.. వైసీపీ ప్రజాప్రతినిధులు వెళ్లి ప్రచారాలు ఎందుకు చేశారని టీడీపీ చీఫ్ నిలదీశారు. ప్రత్యేక హోదా తేకుంటే పాలించే హక్కు ఉందా అని మండిపడ్డారు.
ఇచ్చింది గోరంత.. దోచుకుంది కొండంతన్న ఆయన.. సోమశిల, కండలేరు జలాశయాలని అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో 50 టీఎంసీల నీటిని తీసుకొచ్చామని.. తాము నిర్మించిన వాటికి రంగులు వేసుకుంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
విశాఖ స్టీల్ను ప్రైవేటీకరిస్తే జగన్ ఎందుకు మాట్లాడలేదన్న ఆయన.. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు రాజీనామాలు చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు. దేశంలో ఎక్కడాలేని మద్యం బ్రాండ్లు తెచ్చారని... నాసిరకం మద్యంతో ఆరోగ్యాలు కాలరాస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాకా ఎవర్నీ వదలనన్న చంద్రబాబు.. తప్పుడు కేసులతో వేధించిన పోలీసులను కూడా వదలనని హెచ్చరించారు.