చెత్త పాలనలో....చెత్త రోడ్ల తో...చెత్తపై పన్నులతో జగన్ చెత్త సిఎంగా చరిత్ర లో నిలిచిపోతారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. 2019 లో టీడీపీ మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేదని ఆయన అన్నారు.
వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో అనంతపురం జిల్లా కదిరికి చెందిన పలు పార్టీల నేతలు, కార్యకర్తలు చంద్రబాబు సమక్షలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనారిటీ లకు జగన్ పూర్తిగా ద్రోహం చేశారని ఆరోపించారు. ముస్లింల కోసం టీడీపీ హయాంలో తీసుకు వచ్చిన దుల్హన్ పథకం, రంజాన్ తోఫా వంటి పథకాలను ముఖ్యమంత్రి నిలిపివేశారని చంద్రబాబు మండిపడ్డారు
మౌజంలకు, ఇమామ్ లకు గౌరవ వేతనం ఇచ్చింది తామేనని ఆయన గుర్తు చేశారు. 2019 లో టీడీపీ మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్లో పోలవరంతో సహా అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు పూర్తి అయ్యేవని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. నేడు వృధాగా పోతున్న నీటితో రాయలసీమను రతనాల సీమగా మార్చే వాళ్ళమని టీడీపీ అధినేత ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ నివారణకు కేంద్రం ఇచ్చిన రూ. 1100 కోట్లను జగన్ పక్కదారి పట్టించారని చంద్రబాబు ఆరోపించారు. చెత్త పాలనలో....చెత్త రోడ్ల తో...చెత్తపై పన్నులతో జగన్ చెత్త సిఎంగా చరిత్ర లో నిలిచిపోతారని ఆయన దుయ్యబట్టారు.
Also REad:TDP Chandrababu Naidu: రాజకీయ విమర్శలు మాని.. బాధితులకు ఆదుకోవాలి.. ప్రభుత్వం చంద్రబాబు ఆగ్రహం
అంతకుముందు జూలై 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (parliament monsoon session 2022) ప్రారంభమవుతున్న నేపథ్యంలో టీడీపీ (tdp) ఎంపీలతో చంద్రబాబు నాయుడు (chandrababu naidu) సమావేశమయ్యారు. ఈ మేరకు పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ భేటీకి లోక్సభ సభ్యులు గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరయ్యారు.
ఇకపోతే.. రాష్ట్రంలోని వరదలు, వర్షాలపై (floods in ap) టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం స్పందించారు. నిన్న మీడియాతో మాట్లాడిన ఆయన.. వరద బాధితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆదమరచి నిద్రపోతోందని ధ్వజమెత్తారు. ఇటువంటి విపత్తుల సమయంలో ప్రజలను హెచ్చరించే వ్యవస్థలను.. జగన్ (ys jagan) ప్రభుత్వం నాశనం చేసిందని విమర్శించారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం అందించే.. చిన్న చిన్న సూచన ప్రజలకు ధైర్యాన్ని ఇస్తాయని అన్నారు. తగిన సమయంలో అప్రమత్తం చేయడం వల్ల ప్రజల ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించగలమని తెలిపారు.
