Asianet News TeluguAsianet News Telugu

వాళ్ల రిజర్వేషన్లు తగ్గించిందే జగన్.. బీసీలకు ఏం చేశారని, ఆ కార్పోరేషన్లలో కుర్చీలు కూడా లేవు : చంద్రబాబు

బీసీలకు సీఎం జగన్ ఏం చేశారో చర్చకు రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. బీసీ రిజర్వేషన్లను జగన్ 24 శాతానికి తగ్గించారని,కుర్చీలు కూడా లేని కార్పోరేషన్లు పెట్టి.. పనికిరాని పదవులు ఇచ్చారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

tdp chief chandrababu naidu slams ap cm jagan over bc welfare
Author
First Published Dec 30, 2022, 5:31 PM IST

బీసీలకు సీఎం జగన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. శుక్రవారం ఆయన నెల్లూరులో మాట్లాడుతూ... బీసీలను కొందరు ఓటు బ్యాంక్‌గానే చూస్తున్నారని ఆరోపించారు. బీసీలకు ఉన్నత పదవులు, బీసీ సబ్‌ప్లాన్ తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని చంద్రబాబు గుర్తుచేశారు. బీసీ రిజర్వేషన్లను జగన్ 24 శాతానికి తగ్గించారని, దీనిపై మాట్లాడితే అక్రమ కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్చీలు కూడా లేని కార్పోరేషన్లు పెట్టి.. పనికిరాని పదవులు ఇచ్చారంటూ ఆయన దుయ్యబట్టారు. ఇసుక, సిమెంట్ రేట్లు పెంచి నిర్మాణ రంగాన్ని నాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని జగన్ చేయిస్తున్నారని. దేశంలోని ముఖ్యమంత్రులందరి ఆదాయం కలిపి రూ.317 కోట్లు అయితే జగన్ ఒక్కడి ఆదాయమే రూ.373 కోట్లని చంద్రబాబు చురకలంటించారు. బీసీలకు జగన్ ఏం చేశారో చర్చకు రావాలంటూ ఆయన సవాల్ విసిరారు. 

అంతకుముందు జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. జగన్ పై 120 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో వున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లోకి రాలేని స్థితిలో సీఎం వున్నారని.. పోలీసులను అడ్డుపెట్టుకుని ఎంతకాలం దాక్కుంటారంటూ గోరంట్ల ఎద్దేవా చేశారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించి స్థానిక సంస్థలను మోసం చేశారని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. బటన్ నొక్కడం తప్పించి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసిందేమీ లేదని గోరంట్ల దుయ్యబ్టటారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కల్పించలేదని.. ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్నారు. ఆరు లక్షల మంది పింఛన్లను కట్ చేశారని.. గాల్లో వచ్చిన వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అదే గాల్లో కొట్టుకుపోతారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ALso REad: జగన్‌పై 120 మంది ఎమ్మల్యేల అసంతృప్తి.. గాల్లో వచ్చారు, గాల్లోనే కొట్టుకుపోతారు : గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలనం

ఇకపోతే.. సొంత ప్రభుత్వంపై విమర్శలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోడ్లు, గుంతలు పూడ్చలేకపోతున్నామన్నారు. తాగేందుకు నీళ్లు లేవంటే కేంద్రం నిధులిస్తోందని... అప్పుటు నీళ్లిస్తామని చెప్పుకోవాల్సి వస్తోందన్నారు. కేంద్రం నిధులిస్తే మీరేం చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారని ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. ఈ నాలుగేళ్లలో ఏం పని చేశామని ఓట్లు అడగాలని ఆనం ప్రశ్నించారు. ప్రాజెక్ట్‌లేమైనా కట్టామా... పనులు మొదలుపెట్టామా అని ఆయన నిలదీశారు. పెన్షన్ ఇస్తే ఓట్లు వేస్తారా, గత ప్రభుత్వం కూడా పెన్షన్ ఇచ్చిందని, ఏమైందని ఆనం ప్రశ్నించారు. పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పానని, లే ఔట్లు వేశామే కానీ ఇళ్లు కట్టామా అని ఆనం రామనారాయణ రెడ్డి నిలదీశారు. 

కాగా.. అధికారులతో సమీక్ష సందర్భంగా వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సౌత్ మోపూరులోని మొగిలిపాలెం వద్ద సవిటి వాగు తెగిపోయి దాదాపు 150 ఎకరాల వరకు పంట పొలాలు నీటమునిగాయి. అధికారుల వైఖరి కారణంగానే ఇలా జరిగిందంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శలు చేశారు. పై నుంచి ఎంత వరద వస్తుందో తెలియదా అంటూ ఇరిగేషన్ అధికారులను కడిగిపారేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios