కోడికత్తితో డ్రామాలు.. గొడ్డలిపోటును గుండెపోటన్నారు, ఇప్పుడు ఎమ్మెల్సీ కోసం కోనసీమలో రాజకీయం : చంద్రబాబు
ఒంగోలులో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు కోడికత్తితో డ్రామాలు ఆడారని, గొడ్డలిపోటును గుండెపోటని చెప్పి రాజకీయాలు చేశారని ఆయన ఎద్దేవా చేశారు.
ప్రత్యేక హోదా తెస్తామన్న వైసీపీ (ysrcp) హామీ ఏమైందని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (telugu desam party) అధినేత నారా చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ప్రశ్నించారు. ఒంగోలులోని మండువవారిపాలెంలో జరుగుతోన్న టీడీపీ మహానాడులో (tdp mahanadu) చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ అవినీతి వల్లే రాష్ట్రం దివాళా తీసిందని ఎద్దేవా చేశారు. సంక్షేమం లేదని, అంతా మోసకారి సంక్షేమమేనంటూ చంద్రబాబు దుయ్యబట్టారు. పోలవరంలో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందని... అక్కడ ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 30 లక్షల ఇళ్లని చెప్పిన మీరు కట్టింది మూడే ఇళ్లని.. అడిగితే కేసులు పెడుతున్నారని, మీ కేసులు మమ్మల్ని ఏమీ చేయలేవని చంద్రబాబు స్పష్టం చేశారు. వర్షాకాలంలో రోడ్లపై చేపలు పట్టేలా నీళ్లు ఉంటున్నాయని సెటైర్లు వేశారు.
గొడ్డలిపోటును గుండెపోటని చెప్పి రాజకీయాలు చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఎన్నికల ముందు కోడి కత్తి డ్రామా ఆడారని... ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు నమ్మారని ప్రతిపక్షనేత గుర్తుచేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేశాడని... సమస్యను పక్కదారి పట్టించేందుకు కోనసీమ అల్లర్లు తీసుకొచ్చారని చంద్రబాబు ఆరోపించారు. కోనసీమలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. మంత్రిని కాపాడిన పోలీసులు ఇల్లు తగలబడకుండా ఎందుకు ఆపలేదని చంద్రబాబు ప్రశ్నించారు.
ALso Read:వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే తిరగబడండి: ఒంగోలులో మహానాడును ప్రారంభించిన చంద్రబాబు
మీరే దాడిచేసుకొని మీరే రాజకీయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ సీట్లలో మూడింటినీ మరో రాష్ట్రం వాళ్లకు ఇచ్చారని.. సహ నిందితులకు సీట్లు ఇచ్చారని చంద్రబాబు ధ్వజమెత్తారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారని.. పోలవరం ఏమైంది, విభజన హామీల అమలు ఏమయ్యాయని ఆయన నిలదీశారు. గెలిచిన తర్వాత కేంద్రం వద్ద మెడలు వంచి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని... జగన్ దిగిపోతే తప్ప మంచి రోజులు రావని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జగన్ అండ్ కంపెనీ ఆదాయం పెరిగిందని... క్విట్ జగన్.. సేవ్ ఏపీ నినాదం ప్రతి ఇంట్లో వినిపించాలని ప్రతిపక్షనేత పిలుపునిచ్చారు.
అలాగే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే తిరగబడాలని రైతులను కోరారు చంద్రబాబు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం వల్ల భవిష్యత్తులో అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి Farmers బ్యాంకు ఖాతాల్లో డబ్బులు చెల్లిస్తామని చెబుతున్నప్పటికీ భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించకుండా అడ్డుకోవాలని రైతులను కోరారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని .. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాలని ఆయన పిలుపునిచ్చారు.