నిన్న ఎన్టీఆర్.. నేడు బాలు , ‘‘గాడిదకేం తెలుసు గంధపుచెక్క వాసన’’ : జగన్పై చంద్రబాబు ఫైర్
గుంటూరులోని గాన గంధర్వుడు, దివంగత సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తొలగింపు వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. కరుడుకట్టిన దోపిడీ దొంగలకు దోచుకోవడం తప్ప కళల గురించి, కళాకారుల గురించి ఏం తెలుస్తుందని ఆయన చురకలు వేశారు.
గుంటూరులోని గాన గంధర్వుడు, దివంగత సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తొలగింపు వ్యవహారం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై పలు పార్టీలు, బాలు అభిమానులు మండిపడుతున్నారు. తాజాగా ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు మంగళవారం ఆయన వరుస ట్వీట్లు చేశారు.
‘‘ గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన అని ఒక సామెత ఉంది. కరుడుకట్టిన దోపిడీ దొంగలకు దోచుకోవడం తప్ప కళల గురించి, కళాకారుల గురించి ఏం తెలుస్తుంది? అందుకే నిన్న ఎన్టీఆర్ వంటి మహానుభావుడిని అవమానించారు. ఈరోజు గాన గంధర్వుడిని అవమానించారు’’ అంటూ చంద్రబాబు ఫైరయ్యారు.
‘‘ఎస్పీ బాలు గారు మన తెలుగువాడు అని చెప్పుకోవడమే మనకు గర్వకారణం. అటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని అనుమతి లేదంటూ తొలగించడం... ఇంకా ఘోరంగా తొలగించిన విగ్రహాన్ని మరుగుదొడ్డిలో పెట్టడం తెలుగుజాతికే అవమానకరం. ఇది తెలిసి మనసు చివుక్కుమంది’’ అని టీడీపీ చీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని అవమానించినందుకు ప్రభుత్వం వెంటనే తెలుగుప్రజలకు క్షమాపణ చెప్పి, బాద్యులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.
కాగా.. కొద్దిరోజుల క్రితం గుంటూరులో ఏర్పాటు చేసిన ఎస్పీ బాల సుబ్రమహ్మణ్యం విగ్రహాన్ని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించడం వివాదాన్ని రేకెత్తించింది. కొంత కాలం కిందట మదర్ థెరీసా చౌరస్తాలో కళా దర్బార్ తరుఫున విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే దీనికి అనుమతి లేదంటూ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది దానిని అక్కడి నుంచి తొలగించారు. ఈ చర్యపై కళాకారులు మున్పిసల్ కార్పొరేషన్ ఆఫీసర్లపై అసహనం వ్యక్తం చేశారు.
ALso REad:బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తొలగింపు.. ఇదీ కారణం : గుంటూరు మున్సిపల్ కమీషనర్ వివరణ
ఈ సందర్భంగా కళాదర్బార్ అధ్యక్షుడు పొత్తూరి రంగారావు మాట్లాడుతూ.. గాయకుడు ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని రెండు సంవత్సరాలుగా ఆఫీసర్ల చుట్టూ తిరిగామని ఆయన అన్నారు. తరువాత విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. కానీ దానిని ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. అంత గొప్ప గాయకుడైన ఎస్పీ బాల సుబ్రమహ్మణ్యంకు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్లు ఇచ్చే గౌరవం ఇదేనా అని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో గుంటూరు సిటీలో మాత్రమే ఎస్పీ బాలు విగ్రహాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. మరెక్కడా లేవని అన్నారు. అయితే ఈ గుంటూరు సిటీలో దాదాపు 200పైగా అనుమతి లేని విగ్రహాలు ఉన్నాయని తెలిపారు. కానీ ఒక్క బాలు విగ్రహాన్ని ఎందుకు తొలగించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మహా గాయకుడైన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో గుంటూరు మున్సిపల్ కమీషనర్ కీర్తి చేకూరి స్పందించారు. నగరంలో ఎస్పీ బాలు విగ్రహా ఏర్పాటుకు సంబంధించి అపోహలు వచ్చాయని ఆమె అన్నారు. 2021 జూన్ 5నే బాలు విగ్రహా ఏర్పాటుకు అనుమతి ఇచ్చారని కమీషనర్ స్పష్టం చేశారు. నాజ్ సెంటర్ లో బాలు విగ్రహా ఏర్పాటు అనుమతి ఇచ్చారని కీర్తి చెప్పారు. నాజ్ సెంటర్ లో ఏర్పాటు చేయకుండా మదర్ థెరిస్సా సెంటర్లో విగ్రహం పెట్టారని కమీషనర్ పేర్కొన్నారు. అనుమతి లేని చోట విగ్రహం పెట్టడంతోనే తొలగించామని కీర్తి స్పష్టం చేశారు. నాజ్ సెంటర్లో విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చని కళా దర్బార్ సంస్థ సభ్యులకు చెప్పామని ఆమె తెలిపారు.