అధికారంలోకి రాగానే మళ్లీ ‘‘దుల్హాన్’’ .. జగన్లా మోసం చేయను, లక్ష ఇస్తా : ముస్లిం సోదరులతో చంద్రబాబు
టీడీపీ అధికారంలోకి రాగానే మళ్లీ దుల్హాన్ పథకాన్ని తీసుకొస్తానన్నారు చంద్రబాబు నాయుడు. జగన్లా మోసం చేయకుండా ఖచ్చితంగా లక్ష ఇస్తానని తెలిపారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. శుక్రవారం పొన్నూరులో ముస్లిం సోదరులతో ఆయన ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 1983లో తొలి టీడీపీ ప్రభుత్వం వస్తే, 1985లోనే ముస్లింలకు మైనారిటీ కార్పోరేషన్ ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. ఉర్దూను రెండో అధికార భాషగా చేశామని గుర్తుచేశారు.
ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లడం కోసం హైదరాబాద్లోనే హజ్ హౌస్ కట్టానని, ఆర్ధిక సాయం కూడా చేశామని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీలను నిర్మించినట్లు తెలిపారు. పది లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ముస్లింలకు దుకాన్ మకాన్, దుల్హన్ పథకాలను తీసుకొచ్చామని చంద్రబాబు వెల్లడించారు. జగన్ వాటన్నింటినీ రద్దు చేయడమే కాకుండా.. పెళ్లి కానుక కింద లక్ష ఇస్తానని చెప్పి నిలిపివేశాడని మండిపడ్డారు.
Also REad:జగన్లా నేను పారిపోను, ఆధారాలుంటే నిరూపించండి : స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ దుల్హాన్ పథకాన్ని తీసుకొస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. జగన్లా మోసం చేయక, లక్ష ఇస్తానన్నారు. పథకాలకు డబ్బులు లేవు గానీ, సాక్షికి ప్రకటనలు ఇవ్వడానికి మాత్రం డబ్బులు వున్నాయా అని చంద్రబాబు ప్రశ్నించారు. నంద్యాలలో అబ్దుల్ సలాం అధికార పార్టీ, పోలీసుల వేధింపుల కారణంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా వక్ఫ్ బోర్డ్ ఆస్తులను కబ్జా చేస్తున్నాడని చంద్రబాబు ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టులో పోరాడుతానని ఆయన హామీ ఇచ్చారు.