కన్ను పొడిచినా స్టేషన్ బెయిల్... నినాదాలకే హత్యాయత్నం కేసు, ఇంతలా సాగిలపడొద్దు : పోలీసులపై బాబు ఫైర్
ఏపీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. చెన్నుపాటి గాంధీపై దాడి చేసిన నిందితుల రిమాండ్ రిపోర్టును కోర్టు తిరస్కరించినా, పోలీసులు వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు.
టీడీపీ నేత చెన్నుపాటి గాంధీపై దాడి ఘటనపై మరోసారి తీవ్రంగా స్పందించారు చంద్రబాబు నాయుడు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గాంధీపై దాడి చేసిన నిందితుల రిమాండ్ రిపోర్టును కోర్టు తిరస్కరించినా, పోలీసులు వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. కంట్లో పొడిచినా స్టేషన్ బెయిల్, నినాదాలు చేస్తే హత్యాయత్నం కేసు ఇలాంటి చర్యలతో పోలీసులు తాము ఎటువైపో స్పష్టం చెప్పారని చంద్రబాబు విమర్శించారు. వారి తీరు పోలీస్ శాఖ ప్రతిష్టకే మాయనిమచ్చ అని ప్రతిపక్షనేత ఎద్దేవా చేశారు. పోలీసులు ఇంతలా సాగిలపడటాన్ని ప్రజలు ఆమోదించరని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకునేది నిందితులను రక్షించేందుకు కాదని ఆయన హితవు పలికారు.
ఇదిలావుండగా.. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన పార్టీ నేతలకు బుధవారం క్లాస్ పీకారు చంద్రబాబు నాయుడు. పార్టీకి చెందిన చెన్నుపాటి గాంధీపై దాడి జరిగితే నేతలు సరిగా స్పందించకపోవడం దారుణమన్నారు. ఇకనైనా నేతల తీరు మారాల్సి వుందన్న ఆయన.. మారకుంటే సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. రాబోయే రోజుల్లో జిల్లా నేతలంతా ఉమ్మడి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. అయితే ఇదే సమావేశానికి కీలక నేతలైన ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాలు గైర్హాజరైన వ్యవహారంపైనా చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఢిల్లీలో వున్న కారణంగా కేశినేని.. విదేశీ పర్యటనలో వున్నందున దేవినేని, బొండా ఉమాలు ఈ భేటీలో పాల్గొనలేకపోయారు.
ALso Read:కృష్ణాజిల్లా టీడీపీ నేతలతో కీలక సమావేశం.. ముగ్గురు నేతల డుమ్మా, చంద్రబాబు సీరియస్
ఇకపోతే.. ఇటీవల ప్రత్యర్థుల దాడిలో గాయపడ్డ చెన్నుపాటి గాంధీని మంగళవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ పరామర్శించారు. గత వారం ప్రత్యర్థుల దాడిలో చెన్నుపాటి గాంధీ కంటికి గాయమైన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన తర్వాత విజయవాడలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తీసుకున్న అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో నారా లోకేశ్ మంగళవారం చెన్నుపాటి గాంధీని హైదరాబాద్లో పరామర్శించి, చికిత్స గురించి ఆరా తీశారు. అన్నివిధాలా పార్టీ అండగా వుంటుందని, అధైర్యపడాల్సిన అవసరం లేదని లోకేష్ ధైర్యం చెప్పారు.
మరోవైపు... చెన్నుపాటి గాంధీపై దాడి వ్యవహరంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దాడి అనంతరం చంద్రబాబు నాయుడు.. గాంధీ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ .. ఇది పిరికిపందల చర్య అని, ఓడిపోతామనే భయంతో వైసీపీ నాయకులు దాడికి పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు