Chandrababu-Pawan Kalyan: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.. ఏయే అంశాలపై చర్చించారంటే..?
Chandrababu-Pawan Kalyan: టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu)తో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మధ్య కీలక భేటీ జరిగింది. దాదాపు మూడున్నర గంటలపాటు సాగిన ఈ భేటీలో పలు కీలక విషయాలను చర్చించినట్టు తెలుస్తోంది.
![Tdp Chief Chandrababu Naidu Discuss With Janasena Chief Pawan Kalyan On Key Issues KRJ Tdp Chief Chandrababu Naidu Discuss With Janasena Chief Pawan Kalyan On Key Issues KRJ](https://static-ai.asianetnews.com/images/01gfndkd2w6778fp2x02h8rz7g/whatsapp-image-2022-10-18-at-3-41-53-pm-jpeg_363x203xt.jpg)
Chandrababu-Pawan Kalyan: టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu)తో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ ప్రత్యేక భేటీ దాదాపు మూడున్నర గంటలపాటు సాగింది. సంక్రాంతి సందర్భంగా పవన్ను భోజనానికి చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సమావేశంలో నారా లోకేష్తో పాటు నాదెండ్ల మనోహర్, ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు కూడా పాల్గొన్నారు. ఈ తరుణంలో తెలుగుదేశం - జనసేన సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
ఈ ప్రత్యేక భేటీలో12 అంశాలతో టీడీపీ- జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని, ఈ అంశంపై ఇరు పార్టీ నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జనసేన షణ్ముఖ వ్యూహం.. టీడీపీ సూపర్ సిక్స్ అనే పేరుతో వారిరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెదేపా, జనసేన (Janasena) వర్గాలు పేర్కొన్నాయి. అలాగే.. సుదీర్ఘంగా సాగిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటనపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది.
ఇక అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ-జనసేన పార్టీల్లోకి వైసీపీ నేతల చేరికలు, వారికి సీట్ల కేటాయింపుపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి ప్రచార సభలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాల గురించి చర్చించినట్టు తెలుస్తోంది. అదే విధంగా మందడంలో ఆదివారం నాడు నిర్వహించే భోగి మంటలు కార్యక్రమంలో ఇరు పార్టీల నేతలు కలిసి పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో ప్రజా వ్యతిరేక జీవోలను భోగి మంటల్లో దహనం చేయనున్నారు.
మరోవైపు.. ఈ ఎన్నికల్లో ఇరుపార్టీలు బీజేపీతో కలిసి వెళ్లాలా? వద్దా? అనే విషయంపై కూడా చర్చ జరిగినట్టు, బీజేపీ విషయంలో చాలా జాగ్రత్తగా, ఆచితూచీ స్పందించాలని ఏకాభిప్రాయానికి వచ్చినట్టు చెబుతున్నారు. గత ఎన్నికల్లో తమకు ఎదురైన అనుభవాలను వారు విశ్లేషించుకున్నారని సమాచారం. ఏదిఏమైనా.. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెదేపా, జనసేన అధినేతలు భేటీ కావడం రాజకీయంగా చర్చనీయంగా మారింది.