టీమిండియా కెప్టెన్ మిథాలీ సరికొత్త రికార్డ్... అభినందించిన చంద్రబాబు
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగుల మైలురాయిని అందుకుని రికార్డ్ సృష్టించిన మిథాలీపై చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు.
అమరావతి: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ను ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగుల మైలురాయిని అందుకుని రికార్డ్ సృష్టించిన మిథాలీపై చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు.
''మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డును తన పేరిట నమోదు చేసుకుని రికార్డ్ నెలకొల్పిన టీమిండియా క్రికెటర్ మిథాలి రాజ్ కు అభినందనలు. ఇరవైరెండేళ్ళ సుదీర్ఘ కాలం అంతర్జాతీయ క్రికెటర్ గా కొనసాగుతూ ఒంటిచేత్తో భారత జట్టును విజయతీరాలకు చేరుస్తున్నారు. అందుకే ఆమె లెజెండరీ క్రికెటర్ అయ్యారు'' అని చంద్రబాబు కొనియాడారు.
ఇంటర్నేషనల్ కెరీర్లో ఇప్పటికే 22 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏకైక మహిళా క్రికెటర్గా ఘనత సాధించిన మిథాలీ రాజ్ తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన మూడో వన్డేలో మరో మైలురాయికి చేరుకున్నారు. ఈ వన్డేలో ఓ వైపు వికెట్లు పడుతున్నా పట్టువదలకుండా బ్యాటింగ్ కొనసాగించిన మిథాలీరాజ్ 86 బంతుల్లో 8 ఫోర్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచి టీమిండియాకి విజయాన్ని అందించింది. ఈ క్రమంలోనే వుమెన్స్ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్వుమెన్గా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది టీమిండియా కెప్టెన్. అంతేకాదు ఈ వన్డే సిరీస్లో మిథాలీరాజ్కి ఇది హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ.
విజయవంతమైన చేధనలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్గా (18 సార్లు) నిలిచిన మిథాలీరాజ్... అంతర్జాతీయ క్రికెట్లో 10,273 పరుగులు చేసి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ చెర్లోట్ ఎడ్వర్డ్స్ను అధిగమించింది. పురుషుల క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండగా, మహిళల క్రికెట్లో ‘లేడీ సచిన్’గా గుర్తింపు తెచ్చుకున్న మిథాలీరాజ్ వశమైంది. ఈ ఇద్దరూ 16 ఏళ్ల 205 రోజుల వయసులో టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం.