పంచాయితీ ఎన్నికల్లో బుద్ది చెప్తున్నా... వైసిపి నేతలకు సిగ్గేది: చంద్రబాబు సీరియస్
గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఆవులవారిపాలెంలో సర్పంచ్ అభ్యర్థితో పాటు తెదేపా నేతలను అక్రమంగా అరెస్టులు చేయడాన్ని, పులివెందుల నియోజకర్గంలో పంచాయతీ ఎన్నికలలో తెదేపా తరపున పోటీ చేసిన నేతల పంట పొలాలను నాశనం చేయడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.
గుంటూరు: విద్వేషం, విధ్వంసం అజెండాతో వైసీపీ నేతలు రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తున్నారని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఆవులవారిపాలెంలో సర్పంచ్ అభ్యర్థితో పాటు తెదేపా నేతలను అక్రమంగా అరెస్టులు చేయడాన్ని, పులివెందుల నియోజకర్గంలో పంచాయతీ ఎన్నికలలో తెదేపా తరపున పోటీ చేసిన నేతల పంట పొలాలను నాశనం చేయడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.
''పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఓ వైపు బుద్ధి చెప్తున్నా.. వైసీపీ నేతలకు మాత్రం సిగ్గురావడం లేదు. స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ప్రజల మద్దతు పెరుగుతుండటంతో.. అక్రమ అరెస్టులు చేస్తూ, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. కడప జిల్లా పులివెందులలో టీడీపీ మద్దతుదారుల పొలాన్ని నాశనం చేయడం వైసీపీ నేతల అభద్రతాభావానికి అద్దం పడుతోంది. పోలీసుల ఉదాసీనతతో వైసీపీ గూండాల దాడులు, దౌర్జన్యాలు నానాటికి పెరిగిపోతున్నాయి'' అని ఆవేదన వ్యక్తం చేశారు.
read more పంచాయతీ ఎన్నికలు: అవకతవకలపై ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదు
''గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఆవులవారిపాలెం పంచాయతీలో అక్రమంగా అదుపులోకి తీసుకున్న తెదేపా నేతలను వెంటనే విడుదల చేయాలి. పులివెందులలో పంటపొలాలను నాశనం చేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి'' అని చంద్రబాబు డిమాండ్ చేశారు.