నేను దొంగబ్బాయ్ ని కాదు, గెలిచినోళ్లే దొంగోళ్లు: జగన్ పై లోకేష్ సెటైర్లు
రాష్ట్రంలో దొంగలు గెలిచారని ఫలితంగా అమరావతిలో దొంగలు పడ్డారని విరుచుకుపడ్డారు. తాను దొంగబ్బాయ్ ని కాదని గెలిచినవాళ్లే దొంగలు అంటూ జగన్ పై సెటైర్లు వేశారు. తనకు దొంగ ఛానెల్స్ లేవని చెప్పుకొచ్చారు.
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్సీ నారా లోకేష్. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు.
తూర్పుగోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన నారా లోకేష్ వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నెలవారీ పింఛన్లను సక్రమంగా అమలు చేయడంలో కూడా జగన్ సర్కార్ విఫలమైందంటూ ధ్వజమెత్తారు.
ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమవుతూ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబుపై అబండాలు వేస్తున్నారంటూ విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలకు చంద్రబాబుకు సంబంధం ఏంటని నిలదీశారు. తెలుగుదేశం పార్టీని విమర్శించిన వారు ఏమైపోయారో అందరికీ తెలుసునంటూ లోకేష్ శాపనార్థాలు పెట్టారు.
రాష్ట్రంలో దొంగలు గెలిచారని ఫలితంగా అమరావతిలో దొంగలు పడ్డారని విరుచుకుపడ్డారు. తాను దొంగబ్బాయ్ ని కాదని గెలిచినవాళ్లే దొంగలు అంటూ జగన్ పై సెటైర్లు వేశారు. తనకు దొంగ ఛానెల్స్ లేవని చెప్పుకొచ్చారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ విజయంతో గెలిపించాలని నారా లోకేష్ కోరారు. అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే సాధ్యమంటూ నారా లోకేష్ చెప్పుకొచ్చారు.