దారుణం : చిన్నారి కిడ్నాప్, భిక్షాటన.. మాట వినలేదని, చెయ్యి విరగ్గొట్టి...
తమిళనాడుకు చెందిన ఓ బాలికను కిడ్నాప్ చేసి, ఆమెతో బిక్షాటన చేయిస్తున్నాడో దుర్మార్గుడు. ఆ పని చేయడానికి చిన్నారి ఒప్పుకోకపోవడంతో ఆమెను గాయపరిచాడు ఆ ప్రబుద్ధుడు. విషయం తెలుసుకున్న తణుకు పోలీసులు అతడిని మంగళవారం అరెస్ట్ చేశారు.
తమిళనాడుకు చెందిన ఓ బాలికను కిడ్నాప్ చేసి, ఆమెతో బిక్షాటన చేయిస్తున్నాడో దుర్మార్గుడు. ఆ పని చేయడానికి చిన్నారి ఒప్పుకోకపోవడంతో ఆమెను గాయపరిచాడు ఆ ప్రబుద్ధుడు. విషయం తెలుసుకున్న తణుకు పోలీసులు అతడిని మంగళవారం అరెస్ట్ చేశారు.
తణుకు సీఐ డీఎస్ చైతన్యకృష్ణ తెలిసిన వివరాల మేరకు.. తమిళనాడు, మదురైకు చెందిన సెల్వం, ఆ రాష్ట్రం సాతూర్ కు చెందిన మేరీదాస్ అనే తొమ్మిదేళ్ల చిన్నారిని మూడేళ్ల కిందట బలవంతంగా ఎత్తుకొచ్చాడు.
ఆ తరువాత ఆ చిన్నారితో తిరుపతి, రేణిగుంట, విజయవాడ, రాజమండ్రి ప్రాంతాల్లో భిక్షాటన చేయిస్తూ ఆ డబ్బుతో కాలం వెళ్లదీస్తున్నాడు. ఎవరైనా అడిగితే ఆ చిన్నారిని కూతురు అని చెబుతున్నాడు.
సెల్వం దివ్యాంగుడు కావడంతో, మేరీ దాస్ ను కూతురని చెబుతూ భిక్షాటన చేయిస్తున్నాడు. నెలరోజుల కిందట తణుకు వచ్చిన సెల్వం అక్కడి ఉండ్రాజవరం జంక్షన్ వద్ద గణేష్ సెంటర్లో ఉంటున్నాడు. ఈనెల 20న భిక్షాటన చేయడానికి మేరీదాస్ నిరాకరించడంతో ఆమెను తీవ్రంగా కొట్టాడు.
దీంతో బాగా గాయపడిన చిన్నారి ఏడుస్తూ స్థానిక పాత బెల్లం మార్కెట్ వద్ద కూర్చుంది. ఇది గమనించిన లారీ డ్రైవర్లు ఆ చిన్నారిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆ చిన్నారికి వైద్యపరీక్షలు చేయించారు. ఆమె చేయి విరగడంతో చికిత్స చేయించి దెందులూరులోని బాలసదన్ లో ఉంచారు.
ఈ ఘటన తరువాత సెల్వం తప్పించుకుని తిరుగుతున్నాడు. పోలీసులు మంగళవారం సెల్వంను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. అతనిమీద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చారు. జడ్జి రిమాండ్ విధించారు.
నిందితుడు ఇంకా ఎవరినైనా ఇలా తీసుకువచ్చి భిక్షాటన చేయిస్తున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చైతన్యకృష్ణ వెల్లడించారు. కేసులో సహకరించిన ఎస్సైలు కె. రామారావు, డి. రవికుమార్, సిబ్బందిని ఆయన అభినందించారు.