అందుకే అధికారులతో రాజీకొచ్చా: జేసీ ప్రభాకర్ రెడ్డి
మున్సిపల్ కార్యాలయంలోనే నిరసనకు దిగిన మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మెన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రాజీకొచ్చినట్టుగా ప్రకటించారు. అధికారులతో సమావేశమయ్యారు. ఎక్స్అఫిషియో సభ్యుడిగా ఉన్న ఎమ్మెల్యేకు ఉన్న అధికారులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
తాడిపత్రి: ఎక్స్అఫిషియో సభ్యుడిగా ఉన్న ఎమ్మెల్యేకు ఏ అధికారులున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మెన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.మున్సిపల్ అధికారుల తీరును నిరసిస్తూ సోమవారంనాడు రాత్రి ఆయన మున్సిపల్ కార్యాలయంలోనే నిద్రపోయారు. మంగళవారం నాడు ఉదయం మున్సిపల్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు.తాను సమావేశం ఉందని సమాచారం పంపితే ఈ సమావేశానికి అధికారులు రాకుండా అడ్డుకొన్నారని ఆయన పరోక్షంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై విమర్శలు గుప్పించారు.
also read:స్నానం కూడా మున్సిపల్ ఆఫీస్ లోనే... జేసి ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన
అధికారులను ఇబ్బందిపెట్టొద్దనే ఉద్దేశ్యంతోనే తాను రాజీకి వచ్చినట్టుగా ఆయన చెప్పారు. అధికారులు, సిబ్బందిని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన గుర్తు చేసుకొన్నారు.జేసీ ప్రభాకర్ రెడ్డి సమావేశం నిర్వహించే సమయానికి కరోనాపై అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే పెద్దారెడ్డి నిర్వహించారు. ఈ ర్యాలీ పూర్తైన తర్వాత మున్సిపల్ అధికారులు ఇళ్లకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం నుండి కమిషనర్ సెలవుపై వెళ్లిపోయారు. ఈ పరిణామం జేసీ ప్రభాకర్ రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. మున్సిపల్ అధికారులు కన్పించడం లేదని ఆయన పోలీసులకు పిర్యాదు చేశారు.