మజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సీబీఐకి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
మజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తును ఏప్రిల్ 30వ తేదీ లోపు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ కేసు విచారణను వేగవంతం చేయాలని ఆదేశించింది. వివేకా హత్య కేసులో పేర్కొన్న కుట్ర కోణాన్ని త్వరగా బయటపెట్టాలని తెలిపింది. గతంలో ఈ కేసు దర్యాప్తు వేగంగా చేపట్టాలని ఇదే కోర్టు ఆదేశించిందని సీబీఐ దాఖలు చేసిన నివేదికను పరిగణలోకి తీసుకున్నట్టుగా సుప్రీం కోర్టు పేర్కొంది. ఇక, ఈ కేసులో ప్రస్తుతం దర్యాప్తు అధికారిగా ఉన్న రాంసింగ్ను సీబీఐ తప్పించింది.
ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి కొత్త సిట్ను ఏర్పాటు చేస్తున్నట్టుగా సీబీఐ సుప్రీం ధర్మాసనం ముందు ప్రతిపాదన ఉంచింది. సీబీఐ డీఐజీ కేఆర్ చౌరాసియా నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిపింది. కొత్త సిట్లో ఎస్పీ వికాస్ సింగ్, అడిషినల్ ఎస్పీ ముఖేష్ కుమార్, ఇన్స్పెక్టర్లు ఎస్ శ్రీమతి, నవీన్ పునియా, ఎస్ఐ అంకిత్ యాదవ్ ఉండనున్నట్టుగా పేర్కొంది. ఈ ప్రతిపాదనకు సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. కేసు దర్యాప్తును ఏప్రిల్ 30వ తేదీ లోపు పూర్తి చేయాలని ఆదేశించింది.
ఇక, ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలని ఆయన భార్య తులసమ్మ తరపు లాయర్ చేసిన అభ్యర్థనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. 6 నెలల్లో ట్రయల్ మొదలు కాకపోతే సాధారణ బెయిల్ పిటిషన్కు అవకాశం ఉంటుందని తెలిపింది. సాధారణ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. మెరిట్స్ ఆధారంగానే బెయిల్పై నిర్ణయం ఉంటుందని.. సుప్రీం ఆదేశాల ప్రభావం బెయిల్పై ఉండదని తెలిపింది.