ఆంధ్ర ప్రదేేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐపిఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి చురకలు అంటించింది.
ఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateshwar rao) సస్పెన్షన్ పై ఇవాళ(గురువారం) విచారణ జరిపిన సుప్రీంకోర్ట్ (supreme court) వైసిపి (ysrcp) ప్రభుత్వానికి చురకలు అంటించింది. ఐపిఎస్ అధికారి ఏబివిపై సస్పెన్షన్ ఎంతకాలం కొనసాగిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది న్యాయస్థానం. రెండేళ్లకు మించి సస్పెన్షన్ కొనసాగించకూడదన్న నిబంధనలు గమనించాలని సూచించింది.
ఆల్ ఇండియా సర్వీసులకు చెందిన వ్యవహారం కావడంతో సస్పెన్షన్ కు సంబంధించి నిబంధనల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినట్లు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ సస్పెన్షన్ కొనసాగించేందుకు నిర్దేశాలు కోరినట్లు కోర్టుకు తెలిపారు. అయితే న్యాయవాది వాదనపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం రెండేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశాలు అడుగుతారా? అని ప్రశ్నించింది. రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ కొనసాగించాలన్న వాదనలకు ఆధారాలు చూపాలని సుప్రీం కోర్ట్ ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వ ఎస్ఎల్పీపై జోక్యానికి ఆధారాలు కనిపించట్లేదన్న ధర్మాసనం పేర్కొంది. రేపటిలోగా అన్ని వివరాలతో రావాలని... రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం తెప్పించుకోవాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదికి సుప్రీంకోర్టు సూచించింది. రేపటి తర్వాత విచారణ వాయిదా వేయడం కుదరదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ మేరకు విచారణను రేపటికి వాయిదా వేసింది న్యాయస్థానం.
ఏబి వెంకటేశ్వర రావు సస్పెన్షన్:
2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏబీ వెంకటేశ్వరరావును టార్గెట్ చేసింది. 2017-18లో పోలీసు శాఖ ఆధునికీకరణ కోసం టీడీపీ ప్రభుత్వం భద్రతా పరికరాలు కొనుగోలు చేసిన వ్యవహారంలో ఏబీ అక్రమాలకు పాల్పడ్డట్లు ప్రభుత్వం ఆరోపించింది. పరికరాల కొనుగోలు కాంట్రాక్టును ఇజ్రాయిల్ కు చెందిన ఆర్టీ ఇన్ ఫ్లాటబుల్ ఆబ్జెక్ట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థకు దక్కెలా చేశారని వెల్లడించింది. అదే సంస్థకు తన కుమారుడు ఇండియా ప్రతినిధిగా ఉన్న సంగతిని దాచి పెట్టారని ఆరోపించింది.
ఈ విధంగా తన కుమారుడు చేతన్ సాయికృష్ణకు చెందిన ఆకాశం అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంస్థకు ప్రయోజనం చేకూర్చారని ఏబీవీపై ఆరోపణలున్నాయి. అంతేకాకుండా టెండర్ల ప్రక్రియలో ప్రభుత్వ మార్గదర్శకాలను తొక్కిపెట్టారన్న అభియోగాలు కూడా ఉన్నాయి.
ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్ గా ఉన్న సమయంలో నిఘా పరికరాలను ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసేందుకు వినియోగించారని అప్పట్లో వైసీపీ ఆరోపించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసింది.రక్షణ పరికరాల కొనుగోలు అంశంలో నిబంధనలు పాటించకుండా దేశద్రోహానికి పాల్పడ్డారని కూడా ఆరోపించింది. ఈ అభియోగాల నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేసింది. అంతేకాకుండా పోస్టింగ్ కూడా ఇవ్వలేదు.
అయితే తన సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ ఏబివి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాడు. వాదోపవాదనలు విన్న హైకోర్టు ఏబివిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆదేశించింది. దీంతోహైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఈ క్రమంలోనే హైకోర్టు ఆదేశాలపై గతంలో స్టే విధించింది దేశ అత్యున్నత న్యాయస్థానం రేపు తుదితీర్పు వెలువరించడానికి సిద్దమయ్యింది.
