‘ఓటుకునోటు’ కేసులో చంద్రబాబుకు కొత్త షాక్
- చంద్రబాబునాయుడును వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి వదిలేట్లు లేరు.
- ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆర్కె పలు కేసులతో ముప్పు తిప్పలు పెడుతున్న విషయం అందరికీ తెలిసిందే కదా?
చంద్రబాబునాయుడును వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి వదిలేట్లు లేరు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆర్కె పలు కేసులతో ముప్పు తిప్పలు పెడుతున్న విషయం అందరికీ తెలిసిందే కదా? ప్రభుత్వంపై ఆర్కె సుమారు 35 కేసులు వేసారు. అందులో చాలా వరకూ హైకోర్టులో వివిధ దశల్లో ఉండగా మరి కొన్ని సుప్రింకోర్టులో విచారణ దశలో ఉన్నాయి. తాజాగా ఓటుకునోటు కేసులో కూడా ఆర్కె వేసిన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మెయిన్ కేసుతో జత చేసి విచారించాలని సుప్రింకోర్టు ఆదేశాలు జారీ చేయటం ఆసక్తికరంగా మారింది.
ఓటుకునోటు కేసును సిబిఐ తో విచారణ జరిపించాలని ఆర్కె ఆమధ్య ఓ పిల్ దాఖలు చేసారు. ఆ కేసే సోమవారం విచారణకు వచ్చింది. ఎంఎల్ఏ తరపు న్యాయవాది వాదనలు విన్న సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్కె పిటీషన్ ను మెయిన్ కేసుకు జత చేసి విచారణ జరపాలని ఆదేశించారు.
ఓటుకునోటు కేసులో వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణుడు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కూడా మెయిన్ కేసుకు జత చేయాలని సుప్రింకోర్టు తాజా నిర్ణయంతో చంద్రబాబుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. తెలంగాణా-ఏపి మధ్య నలుగుతున్న కేసు కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య అనధికారికంగా జరిగిన ఒప్పందం మేరకే కేసు ముందుకు సాగటం లేదన్న ఆరోపణలు వినబడుతున్నాయి.
ఎందుకంటే, ఇరు రాష్ట్రాల్లోనూ ఏసిబి ఉన్నతాధికారులే కేసును విచారిస్తున్నారు. ఏసిబి అంటే రాష్ట్రప్రభుత్వ పరిధిలోనే ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అదే, సుప్రింకోర్టులో ఆళ్ళ వేసిన కేసు ప్రకారం ‘ఓటుకునోటు’ కేసును సిబిఐ కి అప్పగిస్తే మొత్తం సీన్ మారిపోతుంది. అప్పుడు చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవని ప్రచారం మొదలైపోయింది. ఎందుకంటే, మరో ఏడాదిన్నరలో సాధారణ ఎన్నికలు వస్తున్నాయి. ఒకవేళ ఎన్నికలకు ముందు గనుక సిబిఐ యాక్టివేట్ అయి కేసును విచారణలో వేగాన్ని పెంచితే ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యక్తిగతంగానే కాక టిడిపికి కూడా ఇబ్బందులు తప్పవు.