మూడు రాజధానులు: జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు బుధవారం నాడు కొట్టివేసింది.
అమరావతి: పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు బుధవారం నాడు కొట్టివేసింది.
రాజధాని అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తేల్చి చె్ప్పింది.హైకోర్టులో విచారణ సాగుతున్నందున ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టులో ఈ నెల 27వ తేదీన విచారణ జరగనుంది.
ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లులను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అమరావతి రైతులు పలువురు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు గతంలో సంచలన తీర్పు ఇచ్చింది. ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీ రద్దు పై ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ స్టేను ఈ నెల 28వ తేదీ వరకు పొడిగించింది.
అయితే ఈ స్టేను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్టేను ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు బుధవారం నాడు కొట్టివేసింది.
ఏపీ హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.ఈ విషయమై విచారణను త్వరగా ముగించాలని సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టును ఆదేశించింది.