పవన్ కల్యాణ్! రామకృష్ణతో కాస్తా జాగ్రత్త!!
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో జాగ్రత్తగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి టీజెఆర్ సుధాకర్ బాబు హెచ్చరించారు.
విజయవాడ: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో జాగ్రత్తగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి టీజెఆర్ సుధాకర్ బాబు హెచ్చరించారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావులకు ముడుపులు అందాయని ఆయన ఆరోపించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి చంద్రబాబు, లోకేష్, మంత్రులు భూములు దోచుకునే పనిలో ఉన్నారని, రాజధాని రైతుల భూములు దోచుకున్న పచ్చదండు సామాన్యుల భూములపై కన్నువేసిందని ఆయన సోమవారం మీడియా సమావేశళంలో ఆరోపించారు.
లింగమనేని రమేష్ అక్రమంగా నిర్మించిన ఇంటిని ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా మార్చుకున్నారని అంటూ ఇంక రమేష్కి అడ్డు అదుపు ఉంటుందా అని ప్రశ్నించారు. లింగమనేని రమేష్ పవన్ కళ్యాణ్కి కూడా భూములిచ్చారని, లింగమనేని ఎస్టేట్స్ భూదోపిడిపై సీబీఐ విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు.
లింగమనేని గ్రూప్లో చంద్రబాబు, లోకేష్ల వాటా ఎంత అని ఆయన ప్రశ్నించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలనిస అవాకులు, చెవాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని సుధాకర్ బాబు హెచ్చరించారు. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలని ఆయన మంత్రి ఆదినారాయణరెడ్డికి సవాలు విసిరారు.