దువ్వాడలో రైలు, ప్లాట్ఫామ్ మధ్య ఇరుక్కున్న విద్యార్థిని మృతి
విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్లో రైలు నుంచి దిగుతుండగా ప్రమాదవశాత్తూ జారిపడి.. ట్రైన్కు, ప్లాట్ఫామ్కు మధ్య ఇరుక్కున్న విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.
విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్లో రైలు నుంచి దిగుతుండగా ప్రమాదవశాత్తూ జారిపడి.. ట్రైన్కు, ప్లాట్ఫామ్కు మధ్య ఇరుక్కున్న విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. రైల్వే సిబ్బంది ఆమెను కాపాడి షీలానగర్లో ఉన్న కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో విద్యార్థిని ఈరోజు ప్రాణాలు కోల్పోయింది. అంతర్గత అవయవాలు దెబ్బతినడంతో మృత్యువుతో పోరాడుతూ తుదిశ్వాస విడిచింది.
తూర్పుగోదావరి జిల్లా అన్నవరానికి చెందిన శశికళ దువ్వాడలోని ఓ కాలేజ్లో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతుంది. ఆమె అన్నవరం నుంచి దువ్వాడకు రాకపోకలు సాగిస్తుంది. బుధవారం ఉదయం దువ్వాడ రైల్వే స్టేషన్లో రాయగడ ప్యాసింజర్ రైలులో నుంచి దిగుతుండగా.. కంపార్ట్మెంట్ మెట్లపై నుంచి జారి బోగీ, ప్లాట్ఫారమ్ మధ్య ఇరుక్కుపోయింది. దీంతో సహాయం కోసం కేకలు పెట్టింది. తోటి ప్రయాణీకులు ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు.
వెంటనే రైల్వే సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. సివిల్ ఇంజినీరింగ్, ఆపరేషన్స్, కమర్షియల్, ఆర్పీఎఫ్ సిబ్బంది, ప్రభుత్వ రైల్వే పోలీసు సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గంటన్నర పాటు అవిశ్రాంతంగా శ్రమించారు. యువతి ఇరుక్కున్న చోట ప్లాట్ఫారమ్ను తొలగించి యువతిని సురక్షితంగా బయటకు తీశారు. ఈ గంటన్నరపాటు విద్యార్థిని నరకయాతన అనుభవించింది. ఆమెను రక్షించిన అనంతరం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె గురువారం ప్రాణాలు కోల్పోయింది.