ప్రతిపక్షంలో ఉన్నా బొత్స హవాకు బ్రేకుల్లేవ్
విజయనగరం: సాధారణంగా అధికార పార్టీ ఆధిపత్యం ఉన్న జిల్లాలో ప్రతిపక్ష నాయకుల హవా అంతగా ఉండదు. ప్రతిపక్ష నాయకుడు ఎంత గొప్పవారైనా అధికారంలో లేనప్పుడు వాళ్ల పప్పులుడకడం కష్టమే. అధికారులు సైతం అధికార పార్టీ వాళ్ల పనుల పట్ల చూపే శ్రద్ధ ప్రతిపక్షనాయకుల పనుల విషయంలో కొంత జాప్యం చేస్తుంటారు. ఇది రాజకీయాల్లో నిత్యం జరిగే తంతు
విజయనగరం: సాధారణంగా అధికార పార్టీ ఆధిపత్యం ఉన్న జిల్లాలో ప్రతిపక్ష నాయకుల హవా అంతగా ఉండదు. ప్రతిపక్ష నాయకుడు ఎంత గొప్పవారైనా అధికారంలో లేనప్పుడు వాళ్ల పప్పులుడకడం కష్టమే. అధికారులు సైతం అధికార పార్టీ వాళ్ల పనుల పట్ల చూపే శ్రద్ధ ప్రతిపక్షనాయకుల పనుల విషయంలో కొంత జాప్యం చేస్తుంటారు. ఇది రాజకీయాల్లో నిత్యం జరిగే తంతు.
కానీ విజయనగరం జిల్లా రాజకీయాలు మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. విజయనగరం జిల్లాలో ఆధిపత్యం టీడీపీదే అయినా.. పెత్తనం మాత్రం వైసీపీలానే కనిపిస్తుంది. ప్రస్తుతం జిల్లాలో కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతిరాజు, రాష్ట్ర మంత్రి సుజయ కృష్ణ రంగరావు వీరికి తోడు జిల్లా ఇన్చార్జి మంత్రిగా గంటా శ్రీనివాసరావు వంటి ఉద్దండులు సైతం ఉన్నారు. ఇంత మంది సీనియర్లు ఉన్నా.. వీరి మాట చెల్లుబాటు కావడం లేదన్నది టీడీపీ నేతలే బాహటంగా చెప్తున్నారు. ఒకవైపు వర్గపోరుతో ఎవరికి వారు జిల్లాపై పట్టు సాధించేందుకు నానా ఇబ్బందులు పడుతుంటే.. వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ మాత్రం అధికారంలో ఉన్నా లేకపోయినా తన హవా కొనసాగిస్తూనే ఉన్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తన హవాకు ఢోకా లేదని సత్తిబాబు నిరూపిస్తూనే ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లపాటు ఏక ఛత్రాధిపత్యంగా జిల్లా రాజకీయాలను గుప్పెట్లో పెట్టుకున్న బొత్స సత్యనారాయణ.....ప్రతిపక్షపార్టీ వైసీపీలో ఉన్నా.. అదే పట్టు కొనసాగిస్తున్నారు. అధికారం మారినా తన ఆధిపత్యానికి మాత్రం ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేస్తున్నారు. అటు టీడీపీ నాయకుల మధ్య సమన్వయ లోపం కూడా బొత్సకు బాగా కలిసొస్తోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు,కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతి రాజు రాజకీయాల్లో స్తబ్ధుగా ఉండటం రాబోయే ఎన్నికల్లో పోటీ చేయరని ప్రచారం కూడా జరుగుతుంది. రాష్ట్ర భూగర్భగనుల శాఖ మంత్రి సుజయ కృష్ణ రంగారావు సైతం తనకంటూ ప్రత్యేక కోటరీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు జిల్లాలో పార్టీ పరిస్థితి కంటే గ్రూపు రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకరు స్తబ్ధుగా ఉండటం ఇద్దరు మంత్రులు సుజయ్కృష్ణ రంగారావు, గంటా శ్రీనివాసరావుల మధ్య ఆధిపత్య పోరు బొత్స సత్యనారాయణకు కలిసివస్తుంది. ఎమ్మెల్యేలు సైతం గంటా గ్యాంగ్...సుజయ్ బ్యాచ్ లు గా విడిపోయారు.
ఇప్పటికే సైలెంట్ గా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని నెల్లిమర్ల నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం లేకపోలేదు. ఒక వేళ నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బొత్స సత్యనారాయణ నుంచి ఇబ్బందులు తలెత్తుతాయన్న ముందుచూపుతో బొత్స హవాకు అడ్డుకట్ట వేయలేని పరిస్థితి గంటాది. ఇలా బొత్స సత్యనారాయణ టీడీపీ హయాంలో కూడా తన హవా కొనసాగిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో అధికారులు, ఇతర నేతలపై పట్టు సాధించిన ఆయన ఇప్పటికీ ఆ సంబంధాలను కొనసాగిస్తూనే ఉన్నారు.
జిల్లా రాజకీయాలతో పాటు డీసీసీబీపైనా ఆధిపత్యం సంపాదించారు. డీసీసీబీ పాలకవర్గాలకు ఎన్నికలు జరపకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ప్రస్తుతం జిల్లా డీసీసీబీ చైర్పర్సన్గా ఉన్నమరిశర్ల తులసీ బొత్స సత్యనారాయణ వర్గం. దీంతో డీసీసీబీపై పూర్తి ఆధిపత్యం వైసీపీ కొనసాగిస్తోంది. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ నిర్ణయం కావడంతో అధికార టీడీపీ ప్రజాప్రతినిధులు కూడా సీరియస్గా దృష్టిసారించలేకపోతున్నారు.
మంత్రులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
పీఎసీఎస్ల వారీగా లేదా నియోజకవర్గాల వారీగా రైతుల రుణాల కోసం నిధులు కేటాయింపులు వంటి అంశాలపై ప్రత్యేకంగా కలెక్టర్ సమీక్షలు నిర్వహించిన పరిస్థితి లేదు. మంత్రులు కూడా డీసీసీబీ గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా డీసీసీబీ పాలక వర్గాలకు మాత్రం ఎన్నికలు నిర్వహించలేదు. జిల్లాలో కొన్ని చోట్ల సర్పంచులు, ఎంపీటీసీలు, జిల్లా ప్రాదేశిక సభ్యులు, ఎమ్మెల్యేలు పార్టీలు మారినా డీసీసీబీ అధ్యక్షులు, పాలకవర్గ డైరెక్టర్లు మాత్రం వైసీపీలోనే కొనసాగుతుండటం గమనార్హం.
అంతేకాదు డీసీసీబీ చైర్ పర్సన్ తులసిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాఅవిశ్వాస తీర్మానం పెట్టకుండా నెట్టుకువస్తున్నారు. రావివలస పీఎసీఎస్లో భారీగా నిధులు దుర్వినియోగం జరిగినట్లు గుర్తించినా ఆ కేసు కోర్టులోనే మగ్గుతోంది. కానీ జిల్లా టీడీపీ నేతలు మాత్రం ఈ ఆరోపణలకు కానీ డీసీసీబీపై పట్టు సాధించాలన్న ప్రయత్నాలు కానీ చెయ్యడం లేదు. ఎవరిపనులు వారు చేసుకుపోతున్నారు. దీంతో డీసీసీబీ రుణాలు సత్తిబాబు అండ్ కో చెప్పిన వాళ్లకే అందుతున్నాయని కనీసం అధికారంలో ఉన్న టీడీపీ నేతలకు అందడం లేదని ప్రచారం జోరుగా సాగుతుంది.
గతపదేళ్ల అధికారంలో బొత్స సత్యనారాయణ మంత్రిగా చక్రం తిప్పడం, భార్య ఝాన్సీ ఎంపీగా ఉండటం సోదరుడు అప్పల నరసయ్య , మరోబంధువు ఎమ్మెల్యేగా కొనసాగడంతో అధికారులు ఇప్పటకీ చాలా మంది బొత్స కనుసన్నల్లోనే ఉంటున్నారు. దీంతో బొత్స సత్యనారాయణ హవాకు అడ్డేలేదని అటు టీడీపీ, ఇటు వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నారు.