నిండు కుండలా శ్రీశైలం జలాశయం.. 10 గేట్లు ఎత్తివేత
ఎగువ వరదతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నిండుకుండల మారింది. దాని పూర్తి స్థాయి నీటి మట్టాలకు వరద నీరు చేరుకుంది. దీంతో అధికారులు పది గేట్లు ఎత్తేసి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.
అమరావతి: శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టాలకు వరద నీరు చేరుకోవడంతో గేట్లు ఎత్తేశారు. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. శ్రీశైలం జలాశయం నీటి మట్టం 885 అడుగులు. వరద నీరు భారీగా రావడంతో ప్రస్తుతం జలాశయంలో నీరు దాదాపు పూర్తిస్థాయికి చేరింది. అంటే.. వరద నీరు ప్రస్తుతం 884.30 అడుగుల ఎత్తుకు చేరింది. దీంతో అధికారులు శ్రీశైలం జలాశయం నుంచి నీటిని దిగువకు పంపివ్వడానికి 10 గేట్లు ఎత్తేశారు. శ్రీశైలం జలాశయానికి చెందిన కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో పవర్ ప్రొడ్యూస్ చేసి దాదాపు 62 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తుండటం గమనార్హం.
ఎగువన వరద నీరు కారణంగా కృష్ణా నది పరవళ్లు తొక్కుతున్నది. దీంతో జలాశయం వేగంగా నిండుకుంది. ఈ కారణంగా ప్రస్తుతం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి జూరాల, సుంకేశుల నుంచి పెద్ద మొత్తంలో నీరు ప్రవహిస్తున్నది. 3.64 లక్షల క్యూసెక్కుల నీరు వీటి గుండా ప్రవహిస్తున్నది.
శ్రీశైలం జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు. కాగా, ప్రస్తుత నీటి నిల్వలు దాదాపు ఈ పరిమితికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ జలాశయంలో నీటి నిల్వ 211.47 టీఎంసీలకు చేరుకుంది.