పప్పుకోసం భార్యతో గొడవ: కత్తిగుచ్చుకొని భర్త మృతి
మద్యానికి బానిసగా మారిన శ్రీను అనే వ్యక్తి భార్యతో గొడవపడి మరణించాడు. విజయనగరంలో నివసించే శ్రీనివాస్ వంటమనిషిగా పనిచేస్తున్నాడు. శనివారం నాడు పప్పు కూర వండలేదని భార్యతో గొడవపడి కిందపడ్డాడు.ఈ క్రమంలోనే కింద ఉన్న కత్తి గుచ్చుకొని శ్రీను చనిపోయాడు.
విజయనగరం: పప్పు కోసం భార్యాభర్తల మధ్య గొడవ భర్త ప్రాణాలను తీసింది. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకొంది. జిల్లాలోని లంకవీధిలో పూరిగుడిసెలో శ్రీను తన కుటుంబంతో నివసిస్తున్నాడు. శ్రీనుకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద కూతురికి పెళ్లి చేసి అత్తింటికి పంపారు. చిన్నకూతురు భార్యతో కలిసి శ్రీను లంకవీధిలో ఉంటున్నాడు. వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఇటీవల కాలంలో ఆయన మద్యానికిగా బానిసగా మారాడు. ప్రతి రోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవకు దిగేవాడు.
శనివారం నాడు కూడ మద్యం తాగొ ఇంటికి వచ్చాడు. భర్తకు వంకాయ కూరతో భార్య భోజనం పెట్టింది. అయితే పప్పు చేయాలని చెప్పినా కూడ ఎందుకు వంకాయ కూర వండావని భార్యతో శ్రీను గొడవకు దిగాడు. పప్పు వండాలని చెప్పాడు. దీంతో పప్పు వండేందుకు భార్య వంట మొదలుపెట్టింది. ఈ సమయంలో మరోసారి భార్యతో గొడవపడుతూ శ్రీను కిందపడిపోయాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న కత్తి శ్రీనుకు గుచ్చుకొంది. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లేలోపుగా తీవ్ర రక్తస్రావమై శ్రీను మరణించాడని వైద్యులు చెప్పారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.