ముద్రగడ చలో కత్తిపూడి: అనుమతి లేదన్న ఎస్పీ
చలో కత్తిపూడి సభకు అనుమతి కోరితే పరిశీలిస్తామని అనుమతి లేని సభలకు వెళ్లి ప్రజలు ఇబ్బందులకు గురి కావొద్దని ఎస్పీ విశాల్ గున్నీ సూచించారు. మరోవైపు చలో కత్తిపూడి సభకు ముద్రగడ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
కాకినాడ : కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చిన చలో కత్తిపూడి సభకు పోలీసులు ఆంక్షలు విధించారు. చలో కత్తిపూడి సభకు ఎలాంటి అనుమతులు లేవని ఎస్పీ విశాల్ గున్నీ స్పష్టం చేశారు. పోలీసు శాఖ అనుమతులు తీసుకోకుండా బహిరంగ సభలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జనవరి 31న ముద్రగడ పద్మనాభం చలో కత్తిపూడి బహిరంగ సభకు పిలుపునిచ్చారు. ఆ సభకు సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాత్రలతో పాటు రాజమండ్రి జయహో బీసీ సభ వరకు అంతా పోలీసుల అనుమతితోనే జరిగాయని వివరించారు.
చలో కత్తిపూడి సభకు అనుమతి కోరితే పరిశీలిస్తామని అనుమతి లేని సభలకు వెళ్లి ప్రజలు ఇబ్బందులకు గురి కావొద్దని ఎస్పీ విశాల్ గున్నీ సూచించారు. మరోవైపు చలో కత్తిపూడి సభకు ముద్రగడ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
అందులో భాగంగా ముద్రగడ స్వగ్రామమైన కిర్లంపూడిలో గత రెండు రోజులుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు అదనపు భద్రతను కూడా కిర్లంపూడికి పంపిస్తున్నారు.
ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు కిర్లంపూడి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ సోమవారం కిర్లంపూడిలో ఆకస్మికంగా పర్యటించారు. సభకు ఎలాంటి అనుమతులు లేని నేపథ్యంలో ప్రజలు సభకు హాజరై ఇబ్బందులు పడొద్దని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
మోహన్ బాబుతో ముద్రగడ భేటీ.. ఆంతర్యం..?