జనసేన అధినేత పవన్ ఇంటి దగ్గర వచ్చిన అపరిచితులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు.  పవన్ కల్యాణ్‌కు హాని తలపెడితే బీజేపీ చూస్తు ఊరుకోదని అన్నారు. 

జనసేన అధినేత పవన్ ఇంటి దగ్గర వచ్చిన అపరిచితులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు. రెక్కీ నిర్వహించి న అపరిచితులు వెనుక ఏ శక్తులు ఉన్నా యున్న విషయం బహిరంగ పర్చాలని కోరారు. పవన్ కల్యాణ్‌కు హాని తలపెడితే బీజేపీ చూస్తు ఊరుకోదని అన్నారు. పవన్ భద్రత విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సోమువీర్రాజు మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన విషయంలో విజయ సాయిరెడ్డి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని అధికారిక పర్యటన ఏపీ ప్రభుత్వం ఛీఫ్ సెక్రటరీ ప్రకటించాలని, కలెక్టర్ పర్యటన వివరాలు చెప్పాలని అయితే ఈ పనులన్నింటినీ విజయసాయిరెడ్డే చేయడం ఏమిటని ప్రశ్నించారు.

ఇక, పవన్ కల్యాణ్‌ను అనుమానస్పద వ్యక్తులు అనుసరించడంపై జనసేన పార్టీ నేతలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘‘ఈ మధ్య పవన్ కల్యాణ్‌ను అనుమానాస్పద వ్యక్తులు ఎక్కువగా అనుసరిస్తున్నారు. విశాఖ సంఘటన తరువాత పవన్ కల్యాణ్‌ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర సందేహాస్పదంగా ఉన్న వ్యక్తులు తచ్చాడుతున్నారు. పవన్ కల్యాణ్‌ ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు ఆయన వాహనాన్ని అనుసరిస్తున్నారు. కారులోని వ్యక్తులు పవన్ కల్యాణ్‌ వాహనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. అనుసరిస్తున్న వారు అభిమానులు కాదని పవన్ కల్యాణ్‌ వ్యక్తిగత రక్షణ సిబ్బంది చెబుతున్నారు. 

వారి కదలికలు అనుమానించే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కారులో, మంగళవారం నాడు ద్విచక్రవాహనాలపై అనుసరించారు. కాగా సోమవారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు పవన్ కల్యాణ్‌ ఇంటి వద్దకు వచ్చి గొడవ చేశారు. ఇంటికి ఎదురుగా వారు కారు ఆపారు. సెక్యూరిటీ సిబ్బంది నివారించబోగా బూతులు తిడుతూ, పవన్ కల్యాణ్‌ను దుర్భాషలాడుతూ గొడవ చేశారు. సిబ్బందిని కవ్వించి రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. ఆయినా సంయమనం పాటించిన సిబ్బంది.. ఈ సంఘటనను వీడియో తీసి జనసేన తెలంగాణ ఇంచార్జి శంకర్ గౌడ్‌కు అందించగా ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ రోజు పిర్యాదు చేశారు’’అని నాదెండ్ల మనోహర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.