Asianet News TeluguAsianet News Telugu

ఆ తొమ్మిది రకాల మద్యం బ్రాండ్ల అమ్మకమేనా నవరత్నాలు అంటే: జగన్ పై సోమిరెడ్డి ఫైర్

కరోనా మహమ్మారి విజృంభణ సమయంలోనూ మద్యం విక్రయాలను ప్రారంభించిన ఏపి సర్కార్ పై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. 

Somireddy Chandramohan Reddy Satires on Jagan's Navaratnalu Scheme
Author
Nellore, First Published May 5, 2020, 1:01 PM IST

గుంటూరు: ఏపి ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంప్ ఆఫీసుల నుంచి బయటకు రాకుండా తీసుకుంటున్న నిర్ణయాల వలన ప్రజలకు ముప్పు వాటిల్లుతోందని... ఏ రోజు ఏం జరుగుతుందో, ప్రభుత్వం ఏం నిర్ణయాలు తీసుకుంటారో అని ప్రజలు బెంబేలెత్తుతున్నారని అన్నారు. 

మొన్న 14 డిస్టిలరీలకు లిక్కర్ తయారు చేసుకోమని అనుమతినిచ్చారని... నిన్న లాక్ డౌన్ సడలించి 25శాతం ధరలు పెంచి మద్యం అమ్మకాలను ప్రారంభించారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా భౌతిక దూరం పాటిస్తేనే కరోనా వైరస్ ను అరికట్టగలమని అచరిస్తుంటే... ఏపీలో మాత్రం మద్యం షాపులు తెరిచి  వేల మంది భౌతిక దూరం పాటించకుండా  కి.మీ బారులు తీరేలా చేసి కరోనా వైరస్ వ్యాప్తి చెందేలా చూడటం సిగ్గుచేటని సోమిరెడ్డి మండిపడ్డారు. 

''ప్రభుత్వ నిర్ణయాల వలన పేదలు కరోనా భారిన పడే అవకాశాలు పెరిగిపోతున్నాయి. మద్యం బానిసలు తినడానికి తిండి లేకపోయినా ఎర్రటి ఎండలో క్యూలో నిలబడి మద్యం కొంటున్నారు. ప్రభుత్వం ఒక చేతితో రూ.1000  అందిస్తూనే మరో చేత్తో మందు రూపంలో రూ.2000 లాక్కుంటున్నారు'' అని ఆరోపించారు. 

''మద్యం సేవించి నిన్న ఒక్క సర్వేపల్లి లోనే ముగ్గురు చనిపోయారు. తాడిపత్రి, పొదలకూర్లులో గొడ్డిబోయిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి పలుకూరి  శ్రీనివాస్ రెడ్డి అనే మరో వ్యక్తిని మద్యం మత్తులో  హత్య చేశారు.  ఇద్దరు వైసీపీ కార్యకర్తలే. కోడూరులో హేమాంద్రి అనే 25 ఏళ్ల వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి బైక్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదం జరిగి చనిపోయాడు.  పొదలకూరు టౌన్ లో యాక్సిరి పోలయ్య అనే గిరిజనుడు ఉదయం 8 గంటల నుంచి క్యూలో నిలబడి మద్యాహ్నం 3 గంటలకు చనిపోయారు'' అని తెలిపారు. 

''డిస్టల్ రీస్ లో ఏం మందు చేస్తున్నారు. ప్రభుత్వం మద్యం షాపులో అమ్మే మందు రోజుకు క్వార్టర్ చొప్పున వారం రోజులు వరుసగా తాగితే మనిషికి పక్షవాతం వస్తుంది. అదే రెండు క్వార్టర్ల లెక్క తాగితే చనిపోతారు. రూ.10 తయారయ్యే క్వార్టర్ ఖర్చు నేడు రూ.100 అమ్ముతున్నారు.  అంతక ముందు ఇతర దేశాలకు ఎక్స్ పోర్టు చేసే మందు బ్రాండ్లన్ని ఏమయ్యాయి?  బూమ్ బూమ్, కోలా, బ్లాక్ బాస్టర్, గెలాక్సి, 9సీహార్సెస్,  మంజీరా, 999లెజెండ్, లూక్ స్టా, రాయల్ గ్రీన్ ఇవేవా జగన్ నవరత్నాలు అంటే?'' అని ఎద్దేవా చేశారు. 

''2014లోనే వైసీపీ నాయకులు కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలను బలిగొన్నారు. సర్వేపల్లిలోనే కొత్త కొత్త బ్రాండులను తయారుచేస్తున్నారు. చెత్త మందును తయారు చేసే డిస్టలరీస్ ఉన్నాయి.వీరు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తమిళనాడు, తెలంగాణ, కేరళ ప్రభుత్వాలకు అనుమతించింది అయినా ఆయా రాష్ట్రాలు మద్యం అమ్మకాలను చేపట్టడం లేదు'' అని అన్నారు. 

''ఎన్నికలు నిర్వహిస్తే కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని రమేష్ కుమార్ ఎన్నికలు వాయిదా వేస్తే జగన్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇప్పుడు మద్యం కోసం జనాలు మరింత భారంగా బయటకు వస్తున్నారు. ఎక్సైజ్ పోలీసులు సరిపోక టీచర్లను మద్యం దుకాణాల దగ్గర కాపలా పెట్టారు.  ముఖ్యమంత్రి చుట్టు పక్కన ఉండే నాయకులంతా డిస్టల్ రీస్ ను బలవంతంగా కైవసం చేసుకున్నారు. ఇది భారీ కుంభకోణం'' అని ఆరోపించారు. 

''జే టాక్స్ కోసం ఇష్టానుసారంగా రేట్లు పెంచేశారు. లాక్ డౌన్ ఎత్తేసే వరకైనా మద్యం షాపులను మూయించాలి. క్వాలిటీ లేని లిక్కర్ ను ఆపండి.  అంత అవసరమైతే మంచి బ్రాండ్లను తెచ్చి ప్రజల ప్రాణాలను కాపాడండి. వైకాపా నాయకులను కొత్త బ్రాండ్ల మందును మూడ్రోజులు తాగమనండి అప్పుడు ఆ మందు ఎంత భయంకరంగా ఉందో అర్ధం అవుతుంది. మద్య పాన నిషేదం అమలు చేస్తామని చెప్పిన వారు రేట్లు పెంచి ఏ విధంగా అమ్ముతారు'' అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 
విమర్శించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios