శ్రీశైలం ఆలయంలో పాము కలకలం... దర్శనం నిలిపివేత
కర్నూలు జిల్లాలోని ప్రముఖ దేవాలయం శ్రీశైలం మల్లిఖార్జున స్వామి సన్నిధిలోని భక్తుల క్యూలైన్లలో పాము కలకలం రేపింది.
శ్రీశైలం: కర్నూలు జిల్లాలోని ప్రముఖ దేవాలయం శ్రీశైలం మల్లిఖార్జున స్వామి సన్నిధిలోని భక్తుల క్యూలైన్లలో పాము కలకలం రేపింది. భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వారి దర్శనానికి వెళ్లే శ్రీకృష్ణ దేవరాయ గోపురం క్యూలైన్లలో పామును చూసిన భక్తులు భయాందోళనకు లోనయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆలయ అధికారులు పాము వల్ల భక్తులకు ఎలాంటి హాని జరక్కుండా జాగ్రత్తపడ్డారు.
పామును పట్టుకునేందుకు ప్రయత్నించడంలో భాగంగా 10 నిమిషాల పాటు భక్తులను దర్శనానికి నిలిపివేసింది దేవస్థానం. అధికారులు.హుటాహుటిన స్నేక్ క్యాచర్ కు ఆలయ అధికారులు సమాచారం అందించి పామును పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో భక్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
read more శ్రీశైలం డ్యాంలో దుప్పి.. పై నుండి కొట్టుకువచ్చి..
ఇటీవల శ్రీశైలంలో అడవి పంది కూడా హల్చల్ చేసిన విషయం తెలిసిందే. శ్రీశైలం అవుటర్ రింగ్ రోడ్డు సమీపాన విభూది మఠం దగ్గర అడవి పంది ఒక వ్యక్తి పై దాడి చేయగా, తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక ద్విచక్ర వాహనాన్నిబలంగా ఢీ కొట్టి, బండిని నుజ్జు నుజ్జు చేసింది.
అక్కడే ఉన్న స్థానికులు వెంటపడడంతో మరింత ఆగ్రహంతో మరొకసారి ద్విచక్ర వాహనాన్ని బలంగా గుద్ది, ట్రాక్టర్ ను ఢీ కొట్టింది. ఇలా నానా హంగామా సృష్టించి చివరకు అడవి పంది మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని శ్రీశైలం దేవస్థానం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నల్లమల అటడి సమీపంలో వుండటంతో ఇలా అడవి జంతువులు శ్రీశైలంలోకి ప్రవేశిస్తున్నాయి.