శివుడు పిలుస్తున్నాడు.. ఈ పాడు సమాజంలో ఉండొద్దన్నాడు.. యువకుడు ఆత్మహత్య..
శివుడు పిలుస్తున్నాడంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం ప్రకాశం జిల్లాలో కలకలం రేపింది. ఈ పాడు సమాజంలో ఉండొద్దని చెప్పాడని సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రకాశం : మూఢనమ్మకాలు, అతి విశ్వాసం ఓ యువకుడి ప్రాణాలు బలి తీసుకుంది. ఈ పాడు సమాజంలో ఉండొద్దు అంటూ.. శివుడు పిలుస్తున్నాడని.. ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం చాట్ల మెడలో ఈ యువకుడి ఆత్మహత్య సంచలనం రేపింది. గ్రామానికి చెందిన శేఖర్ రెడ్డి చెన్నై లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీకి సెలవులు ఇవ్వడంతో ఇటీవలే చాట్ల మడుగు తిరిగివచ్చాడు.
అయితే, తాజాగా అతడు తనను శివుడు పిలుస్తున్నాడు అంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని, ప్రేమ వంటి వ్యవహారాలు లేవని సూసైడ్నోట్లో శేఖర్ రెడ్డి పేర్కొన్నాడు. పిరికి వాడిని కాదని, ఈ పాడు సమాజంలో ఉండవద్దని శివుడు చెప్పాడని సూసైడ్ నోట్లో రాశాడు. పోలీసులు కేసు విచారణ చేపట్టారు.
ఇదిలా ఉండగా, నిరుడు అక్టోబర్ లో ఇలాంటి దారుణ ఘటనే గుజరాత్ లోని దేవ్ భూమి ద్వారకా జిల్లాలో చోటు చేసుకుంది. మూఢనమ్మకాలతో అమానుషానికి ఒడిగట్టారు. కోపంతో ఉన్న దేవత పూనిందని.. ఆమె అందరినీ చంపేస్తుంది అని భయపడే ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆరంభదా గ్రామానికి చెందిన రమీలా సోలంకి అనే మహిళ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు సమీపంలోని గ్రామానికి భర్తతో కలిసి వెళ్ళింది.
అయితే, ఉత్సవాల్లో పాల్గొన్న రామలీలకు ఒక్కసారిగా పూనకం వచ్చినట్లు ప్రవర్తించింది. అది చూసిన అక్కడివారు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే అక్కడే ఉన్న భూతవైద్యుడు రమేష్ సోలంకి ఆమెకు కోపంతో ఉన్న అమ్మవారు పూనిందని అక్కడి ప్రజలను నమ్మించాడు. మూఢ నమ్మకాలను సులువుగా నమ్మే జనాలు దీన్నీ అంతే ఈజీగా నమ్మేశారు.
అంతేకాదు, భూతవైద్యుడు చుట్టూ చేరి.. ఇంకా అతనేం చెబుతాడో అని వేచి చూడడం మొదలుపెట్టారు. దీన్ని అదనుగా తీసుకున్న భూతవైద్యుడు కోపంతో ఉన్న అమ్మవారిని పారద్రోలాలని… లేదంటే ఆమె అందరినీ చంపేస్తుంది అని భయపెట్టాడు. కోపంతో ఉన్న అమ్మవారిని వెళ్లగొట్టేందుకు రమీలాను కొట్టాలని సూచించాడు. దీంతో అక్కడ ఉన్న స్థానికులతో సహా ఆమె బంధువులు కర్రలు, మంటల్లో వేడిచేసిన ఇనుప చూపులతో రమీలాను చావ బాదారు.
దీంతో ఆమె తీవ్ర గాయాలతో గిలగిలలాడింది. దెబ్బలు తాళలేక మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యలో పాల్గొన్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.