బద్వేల్పై టీడీపీ ట్విస్ట్: పోటీపై తెలుగు తమ్ముల్లో భిన్నాభిప్రాయాలు, బాబు నిర్ణయంపై ఉత్కంఠ
కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేసే విషయమై టీడీపీకి చెందిన కొందరు నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన వెంకటసుబ్బయ్య కుటుంబానికే టికెట్ ఇచ్చినందునే పోటీ నుండి తప్పుకోవాలని కొందరు నేతలు కోరుతున్నారు. అయితే ఇప్పటికే అభ్యర్ధిని ప్రకటించినందున పోటీపై వెనక్కి తగ్గొద్దని మరికొందరు నేతలు కోరుతున్నారు.
అమరావతి: కడప (kadapa )జిల్లా బద్వేల్ (badvel bypoll) అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీపై టీడీపీలో (tdp)భిన్నా భిన్నాయాలు నెలకొన్నాయి. ఈ స్థానం నుండి దివంగత వెంకట సుబ్బయ్య (venkata subbaiah) కుటుంబం నుండి వైసీపీ (ysrcp)అభ్యర్ధిని బరిలోకి దింపింది. గత సంప్రదాయాల ప్రకారంగా ఇతర పార్టీలు ఎన్నికల్లో పోటీకి దింపొద్దని టీడీపీ సహా ఇతర పార్టీలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) ఇటీవలనే కోరారు.
అనారోగ్య కారణాలతో బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య ఇటీవల కాలంలో మరణించారు. దీంతో ఈ స్థానం నుండి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఓబులాపురం రాజశేఖర్ (obulapuram rajasekhar)నే టీడీపీ తన అభ్యర్ధిగా ప్రకటించింది. రాజశేఖర్ ప్రచారం నిర్వహిస్తున్నారు.
వెంకట సుబ్బయ్య భార్య దాసరి సుధకు (dasari sudha)వైసీపీ టికెట్ ఇచ్చింది. దీంతో మృతి చెందిన కుటుంబానికి అధికార పార్టీ సీటు ఇచ్చినందున గత సంప్రదాయాల ప్రకారంగా పోటీకి దూరంగా ఉండాలని టీడీపీలో కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. వెంకట సుబ్బయ్య భార్య బరిలో ఉన్నందున సానుభూతి ఆ కుటుంంబానికే ఉంటుందని వారు అభిప్రాయంతో ఉన్నారు.దీంతో ఈ స్థానం నుండి పోటీ చేసినా పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కొందరు నేతలు.
అయితే మరికొందరు నేతలు మాత్రం ఈ అభిప్రాయంతో విబేధిస్తున్నారు. అయితే ఇప్పటికే అభ్యర్ధిని ప్రకటించినందున ఈ సమయంలో వెనక్కి తగ్గడం సరైంది కాదని మరికొందరు నేతలు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఒక్క జడ్పీటీసీని టీడీపీ కైవసం చేసుకొన్న విషయాన్ని నేతలు గుర్తు చేస్తున్నారు.
ఈ విషయమై పార్టీ సీనియర్లతో చంద్రబాబునాయుడు (chandrababu naidu)చర్చించనున్నారు. పార్టీ సీనియర్లతో చర్చించిన తర్వాత ఈ విషయమై చంద్రబాబు పోటీపై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.