ఏపీ కొత్త సీఎస్ ఎంపికలో ట్విస్ట్.. రేసులోకి గిరిధర్ అర్మాణే, జవహర్ రెడ్డికి నిరాశేనా..?
ఏపీ కొత్త సీఎస్ ఎంపికలో ట్విస్ట్ చోటు చేసుకుంది. సమీర్ శర్మ పదవి కాలం ముగియనుండటంతో జవహర్ రెడ్డి నియామకం దాదాపుగా ఖరారైనట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఒక్కసారిగా సీనియర్ ఐఏఎస్ గిరిధర్ అర్మాణే రేసులోకి రావడంతో ఉత్కంఠ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాని కార్యదర్శి సమీర్ శర్మ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో కొత్త సీఎస్ ఎంపికపై జగన్ ప్రభుత్వం దృష్టిపెట్టింది. నిన్నటి వరకు సీనియర్ ఐఏఎస్, జగన్కు అత్యంత సన్నిహితుడైన జవహర్ రెడ్డి నియామాకం దాదాపుగా ఖరారైనట్లు వార్తలు వచ్చాయి. అయితే ఒక్కసారిగా సీఎస్ రేసులో మరో ఐఏఎస్ గిరిధర్ అర్మాణే దూసుకొచ్చారు. ప్రస్తుతం కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిగా వున్న గిరిధర్.. శనివారం సీఎం వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. ఏపీ కేడర్లోని సీనియర్ ఐఏఎస్ల లిస్ట్లో గిరిధర్ ప్రస్తుతం సెకండ్ ప్లేస్లో వున్నారు. ఈ నేపథ్యంలో జగన్తో గిరిధర్ భేటీపై ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన 1988 బ్యాచ్ ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి. వచ్చే ఏడాది జూన్ 30 వరకు ఆయన పదవీకాలం వుంది.
ALso Read:నెలాఖరుతో ముగియనున్న సమీర్ శర్మ పదవీ కాలం.. జవహర్ రెడ్డి వైపు జగన్ మొగ్గు..?
ఇకపోతే.. ఈ ఏడాది మేలో సమీర్ శర్మ పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆరు నెలల పాటు .. అంటే నవంబర్ 30 వరకు పొడిగించింది. సీఎస్ పదవీ కాలం పెంపుపై డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ఇప్పటికే ఒకసారి సమీర్ శర్మ పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది. నిజానికి గతేడాది నవంబర్ 30తో ఆయన పదవీకాలం ముగిసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 2022 మే 31 వరకు ఆరు నెలల పాటు సీఎస్ పదవీ కాలాన్ని పొడిగించింది కేంద్రం.