సెల్ ఫోన్ ను దూరంగాపెట్టలేక... మైనర్ బాలుడు ఆత్మహత్య
ఇటీవలే భర్తను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో వున్న మహిళ ఒక్కగానొక్క కొడుకును కూడా కోల్పోయింది.
అనంతపురం: అతిగా సెల్ ఫోన్ వాడుతున్న కొడుకును మందలించడమే ఆ కన్న తల్లికి కడుపు శోకాన్ని మిగిల్చింది. ఇటీవలే భర్తను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో వున్న మహిళ ఒక్కగానొక్క కొడుకును కూడా కోల్పోయింది. ఈ విషాద సంఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో సోమవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... తాడిపత్రిలోని ఆర్ఆర్ నగర్ కు చెందిన తలారి సుబ్బరాయుడు కొన్నేళ్లక్రితమే మరణించాడు. అతడి భార్య లక్ష్మి ఒక్కగానొక్క కొడుకు కోసమే జీవిస్తోంది. ఆమె కొడుకు తలారి శ్రీనివాసులు(17) పుట్లూరు మండలంలోని ఆదర్శ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు.
ఇటీవల శ్రీనివాసులు ఎక్కువగా సెల్ ఫోన్ వాడుతుండటంతో ఎక్కడ చదువు పాడవుతుందోనని తల్లి ఆందోళనకు గురయ్యింది. దీంతో సెల్ ఫోన్ వాడకాన్ని కాస్త తగ్గించాలని కొడుకును మందలించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయిన శ్రీనివాసులు దారుణ నిర్ణయం తీసుకున్నాడు. సోమవారం ఉదయం పుట్లూరు రోడ్డు రైల్వే లెవల్ క్రాసింగ్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
రైలు పట్టాలపై బాలుడి మృతదేహాన్ని గుర్తించిన రైల్వే జీఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇలా ఇప్పటికే భర్తను కోల్పోయి, ఇప్పుడు ఒక్కగానొక్క కొడుకును కోల్పోయి సదరు మహిళ ఒంటరిగా మారింది.