తిరుమలలో మరో కుంభకోణం... ఆర్జిత సేవా టిక్కెట్లలో మాయ
తిరుమల శ్రీవారి సేవా టిక్కెట్లలో మరో కుంభకోణం వెలుగుచూసింది. శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు ఆన్ లైన్ లాటరీ ద్వారా పారదర్శకంగా అందుతాయి. కానీ అక్కడ కూడా కొందరు మాయగాళ్లు ప్రవేశించి నకిలీ ఆధార్ లతో ఆర్జిత సేవా టిక్కెట్లు పొంది అధిక ధరలకు విక్రయిస్తూ భక్తుల నెత్తిన శఠగోపం పెడుతున్నారు.
తిరుమల: తిరుమల శ్రీవారి సేవా టిక్కెట్లలో మరో కుంభకోణం వెలుగుచూసింది. శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు ఆన్ లైన్ లాటరీ ద్వారా పారదర్శకంగా అందుతాయి. కానీ అక్కడ కూడా కొందరు మాయగాళ్లు ప్రవేశించి నకిలీ ఆధార్ లతో ఆర్జిత సేవా టిక్కెట్లు పొంది అధిక ధరలకు విక్రయిస్తూ భక్తుల నెత్తిన శఠగోపం పెడుతున్నారు. స్వామి వారి సుప్రభాతం సేవకు ఒకరి స్థానంలో మరొకరు హాజరువుతుండటంతో తితిదే విజిలెన్స్ అధికారులు గమనించారు. వారిని పట్టుకుని ఆరా తియ్యగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను ప్రతినెలా మొదటి శుక్రవారం తితిదే ఆన్లైన్లో విడుదల చేస్తుంది. సుప్రభాత సేవ, ఆర్జితసేవ, అర్చన, కళ్యాణోత్సవం, వసంతోత్సవం, దీపాలంకరణ వంటి సేవలకు సంబంధించి టిక్కెట్లు ఆన్ లైన్లో లక్కీ డిప్ ద్వారా భక్తులకు కేటాయిస్తారు. దాదాపు 50వేల టిక్కెట్లను టీటీడీ విడుదల చేస్తోంది. టిక్కెట్ల కోసం భక్తులు నాలుగు రోజుల ముందు ఆన్ లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత లక్కీ డిప్ ద్వారా టిక్కెట్లు అందజేస్తారు.
దీన్ని ఆసరాగావ చేసుకుని మహారాష్ట్రలోని షోలాపూర్ కు చెందిన ప్రభాకర్ తనకున్న నైపుణ్యంతో కొన్ని ఆధార్కార్డుల సమర్పించి సేవా టిక్కెట్లను బుక్ చేశాడు. నకిలీ ఆధార్ నంబర్లతో ఆర్జిత సేవా టిక్కెట్లు పొంది 120 రూపాయలు విలువ చేసే ఒక్కో టిక్కెట్టును 2వేల 500 రూపాయల నుంచి 4వేల రూపాయల వరకు విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
టిక్కెట్టుపై ఉన్నపేరుకు అనుగుణంగా అప్పటికప్పుడు భక్తులకు నకిలీ గుర్తింపు కార్డులు తయారుచేయించి శ్రీవారి దర్శనానికి పంపుతున్నాడని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ టిక్కెట్ల కుంభకోణంపై తితిదే విజిలెన్స్కు ముందస్తుగా సమాచారం రావడంతో నిఘా పెట్టింది. సుప్రభాతం సేవకు వెళుతున్న సమయంలో నలుగురు భక్తులను గుర్తించి అదుపులోకి తీసుకుంది.
అక్రమాలకు పాల్పడుతున్నప్రభాకర్ను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు విజిలెన్స్ అధికారులు. ఇప్పటి వరకూ నిందితుడు 1200 సేవా టిక్కెట్లను అక్రమ మార్గంలో పొందినట్టు విచారణలో వెల్లడైంది. అయితే గతంలో కూడా షోలాపూర్ కేంద్రంగా బల్క్ టిక్కెట్ల కుంభకోణం కూడా జరగడం గమనార్హం.