రఘురామకు షాక్: చింతలపూడి పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ కేసు
ఏసీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను కులం పేరుతో దూషించడంతో పాటు అసభ్యపదజాలాన్ని ఉపయోగించారని అందిన ఫిర్యాదు మేరకు చింతలపూడి పోలీస్ స్టేషన్ లో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై కేసు నమోదైంది.
ఏలూరు:పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పోలీస్ స్టేషన్లో నర్సాపురం ఎంపీ Raghurama krishnam Raju పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఏపీ Cid చీఫ్ Sunil kumar ను కులం పేరుతో దూషించినందుకు కేసు నమోదైంది. సీఐడీ డీజీ సునీల్ కుమార్ ను కులం పేరుతో దూషించడంతో పాటు అసభ్య పదజాలంతో దూషిచారని గొంది Raju అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. సీఐడీ ఏపీ చీఫ్ సునీల్ కుమార్ ది చింతలపూడి స్వంత గ్రామం. రాజు ఫిర్యాదుతో ఎంపీ రఘురామపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని చింతలపూడి పోలీసులు తెలిపారు.
ఈ నెల 12న Hyderabad లోని గచ్చిబౌలిలో ఎంపీ రఘురామకష్ణం రాజు ఇంటికి వెళ్లి విచారణకు రావాలని సీఐడీ నోటీసులు ఇచ్చింది.ఈ నోటీసులు అందుకొన్న రఘురామకృష్ణం రాజు ఈ నెల 17న విచారణకు వస్తానని చెప్పారు. నోటీసులు తీసుకొన్న తర్వాత ఏపీ సీఐడీ సునీల్ కుమార్ పై రఘురామకృష్ణంరాజు ఆరోపణలు చేశారు.
ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కల్గించేలా మీడియాలో వ్యాఖ్యలు చేశారని ఏపీ సీఐడీ అధికారులు 2021 మే 14న రఘురామకృష్ణంరాజును హైద్రాబాద్లోని గచ్చిబౌలిలో అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కల్గించేలా వ్యవహరించారని 124-ఏ , ఐపీసీ 153 - బీసెక్షన్ కింద సీఐడీ కేసు నమోదుచేసింది. దీంతో పాటుగా ఐపీసీ సెక్షన్ 505 కింద బెదిరింపులకు పాల్పడటం, ఐపీసీ సెక్షన్ 120-B కింద దురుద్దేశపూర్వకంగా కుట్రకు పాల్పడ్డారనే అభియోగాల కింద రఘురామరాజుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను సీఐడీ అరెస్ట్ చేసింది.
తనపై నమోదైన కేసుల విషయమై పలు కోర్టుల్లో రఘురామకృష్ణంరాజు పిటిషన్లు దాఖలు చేశారు. చివరకు ఆయన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు.దీంతో 2021 మే 21న రఘురామకృష్ణంరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ను ఉన్నత న్యాయస్థానం ఇచ్చింది. సొంత పూచీకత్తు, ఇద్దరు జామీనుదారులతో, లక్ష రూపాయల షూరిటీ బాండ్లతో బెయిల్ తీసుకోవచ్చని తెలిపింది.
సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసులో విచారణకు సహకరించాలని కూడా బెయిల్ సందర్భంగా కోర్టు సూచించింది. అయితే ఈ కేసుల్లో విచారణకు హాజరు కావాలని కూడా ఎంపీ రఘురామకృష్ణం రాజుకు సీఐడీ అధికారులు సమాచారం పంపారు. అయితే విచారణకు రఘురామకృష్ణంరాజు హాజరు కాలేదని సీఐడీ అధికారులు చెబుతున్నారు. దీంతో సీఐడీ అధికారులు రఘురామకృష్ణంరాజు ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారు.
రఘురామకృష్ణం రాజు నోటీసులు తీసుకొన్నారు. విచారణకు వస్తానని చెప్పారు.అయితే గతంలో తనను అరెస్ట్ చేసిన సమయంలో చిత్రహింసలకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రఘురామకృష్ణం రాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కోరింది.
అయితే ఈ విషయమై లోక్సభ స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో గత వారంలో తాను ఎంపీ పదవికి రాజీనామా చేసి నర్సాపురంలో భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని కూడా రఘురామకృష్ణంరాజు సవాల్ విసిరారు.