మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. ఏం జరిగిందంటే..
పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుతో సహా ఐదుగురిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుతో సహా ఐదుగురిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వివరాలు.. చిలకలూరిపేటలో మంచినీటి చెరువు దగ్గర శుక్రవారం ఎన్టీఆర్ సుజల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా వివాదం చోటుచేసకుంది. ఈ గొడవ సందర్భంగా టీడీపీ నాయకులు తనను కులం పేరుతో దూషించారని మున్సిపల్ అధికారిణి కోడిరెక్క సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను నెట్టివేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే అర్బన్ పోలీసులు మాజీ మంత్రి పుల్లారావుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ పీఏఓ యాక్ట్ 323, 34, 353, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ఏ1గా పుల్లారావు, ఏ2గా మదన్ మోహన్, ఏ3గా బండారుపల్లి సత్యనారాయణ, ఏ4గా కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు శ్రీనివాసరావు, ఏ5గా రాష్ట్ర టీడీపీ నాయకులు కరీముల్లాలను చేర్చారు.
ఇక, నిన్న చోటుచేసుకున్న ఘటనపై సునీత మీడియాతో మాట్లాడుతూ.. తనను కారుతో గుద్దించే ప్రయత్నం చేశారని, ఎస్సీ మహిళనైన తనను కులం పేరుతో దూషించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇదే విషయాన్ని పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు.
ఇక, పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని తాగునీటి చెరువుల వద్ద ఎన్టీఆర్ సుజల ప్లాంటు పునఃప్రారంభోత్సవానికి పుల్లారావు శుక్రవారం వెళ్లారు. అయితే అందుకు అనుమతి లేదని పోలీసులు, మునిసిపల్ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.