ఇదేంటని ప్రశ్నిస్తే నాపైనే ఎస్సీ, ఎస్టీ కేసు... అయినా వెనక్కితగ్గను: అయ్యన్నపాత్రుడు (వీడియో)
ఏపీలో అరాచకపాలన కొనసాగుతోందని... ఎక్కడ చూసినా దాడులు, దౌర్జన్యాలే కనిపిస్తున్నాయని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.
విశాఖపట్నం: ఏపీలో అరాచకపాలన కొనసాగుతోందని... ఎక్కడ చూసినా దాడులు, దౌర్జన్యాలే కనిపిస్తున్నాయని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో దోపిడీ జరుగుతోందన్నారు. గత టీడీపీ హయాంలో ఎమ్మెల్యేలు అభివృద్ధిలో పోటీ పడితే... ఈ వైసీపీ ప్రభుత్వంలో అవినీతిలో ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారని మండిపడ్డారు.
''ఏపీలో ఇసుకను దోచేస్తున్నారు. రాజమండ్రి దగ్గర గోదావరి నదిలోర రోజుకి 2,500 లారీల ఇసుక లోడ్ అవుతోంది. అకౌంట్ ఫర్ అయ్యేది మాత్రం కేవలం 600 లారీలే. స్థానిక వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు మిగతా ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. వైసీపీ నేతల స్వార్థం వల్ల రాష్ట్రంలో భవననిర్మాణ రంగం కుదేలైపోయింది. వైసీపీ నేతల ఇసుక దోపిడీ కారణంగా లక్షలమంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి'' అని పేర్కొన్నారు.
read more ''వైసిపి భూమాయాజాలం...కొనేది లక్షల్లో, అమ్మేది కోట్లల్లో''
''మద్యపాన నిషేదమంటూ ఎన్నికల సమయంలో జగన్ మాయమాటలు చెప్పారు. అధికారంలోకి వచ్చాక నాసిరకం బ్రాండ్లు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పథకాల డబ్బులన్నీ తిరిగి బ్రాందీ షాపులకు వస్తున్నాయి. ఈతకాయంత ఇచ్చి గుమ్మడికాయంత తీసేసుకుంటున్నారు. బ్రాందీ రేట్లు పెరగడం వల్ల గ్రామాల్లో నాటుసారా విక్రయిస్తున్నారు. అది తాగి ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు'' అని అన్నారు.
వీడియో
"
''ఇళ్ల స్థలాల పేరుతో భూములు సేకరిస్తూ భారీ దోపిడీకి పాల్పడుతున్నారు. రాజమండ్రి దగ్గర ఆవ భూముల సేకరణలో రూ. 150 కోట్ల దోపిడీ జరిగింది. తక్కువ రేటు పేదల దగ్గర వైసీపీ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు భూములు కొట్టేస్తున్నారు. నర్సిపట్నం మండలంలో ఒకరి దగ్గర భూమి దగ్గర తీసుకుని మొత్తం డబ్బు ఇవ్వకుండా రూ. 12 లక్షలు కొట్టేశారు. ఇదేమని ప్రశ్నించిన నాపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు. అయితే ప్రభుత్వం చేసే ఇలాంటి బెదిరింపులకు భయపడం'' అని అన్నారు.
''వాలంటీర్ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయింది. ప్రతి దానికీ వాలంటీర్లు డబ్బు డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో నాటుసారా వ్యాపారాన్ని వాలంటీర్లు చేస్తున్నారు. ముగ్గురు వాలంటీర్లు కలిసి వైసీపీ నేతనే చంపేందుకు ప్రయత్నించారు. చెప్పిన మాట విననివారిని హత్యలు కూడా చేసే వ్యవస్థను వైసీపీ సిద్దం చేస్తోంది'' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
''వైసీపీ ప్రభుత్వం గాడి తప్పింది. పాలన చేతకావడం లేదు. చెబితే వినరు. రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారు. పాలనలో ప్రభుత్వాధికారులది కీలకపాత్ర. సంవత్సర కాలంగా వైసీపీ ప్రభుత్వం ఏ తప్పు చేసినా సరిదిద్దకుండా ఉద్యోగులు సమర్థిస్తున్నారు. డీజీపీని హైకోర్టు రెండు , మూడు గంటలు నిలబెట్టింది. చీఫ్ సెక్రటరీ, పంచాయితీరాజ్ సెక్రటరీ, కమిషనర్ కు కోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఈ ఘటనలను చూసి అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రభుత్వానికి భయపడి తప్పులను సమర్థించవద్దు'' అని అయ్యన్నపాత్రుడు సూచించారు.