అమూల్ కోసం .. అన్ని డెయిరీలను బలి చేస్తున్నారు: ధూళిపాళ్ల
సంగం డెయిరీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఆ సంస్థ ఛైర్మన్, టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర.
సంగం డెయిరీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఆ సంస్థ ఛైర్మన్, టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన సంగం డెయిరీ నిబద్ధలతో పనిచేస్తోందని చెప్పారు.
డెయిరీకి విజిలెన్స్ అధికారులు నోటీసులు జారీ చేశారని.. 60 అంశాలకు పైగా సమాచారం కావాలని వాళ్లు అడిగినట్లు నరేంద్ర పేర్కొన్నారు. నోటీసులపై హైకోర్టుకు వెళితే స్టే ఇచ్చినట్లు ధూళిపాళ్ల వివరించారు.
డెయిరీ టర్నోవర్ రూ.4 కోట్ల నుంచి రూ. 913 కోట్లకు చేరుకున్నట్లు నరేంద్ర కుమార్ తెలిపారు. డెయిరీకి సంబంధించి రూ.160 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు ధూళిపాళ్ల వెల్లడించారు.
సంగం డెయిరీ రాజకీయాలకు అతీతంగా ఉండే సంస్థని ఆయన స్పష్టం చేశారు. దేశంలో డెయిరీలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని కానీ ఏపీలో మాత్రం దీనికి వ్యతిరేకంగా డెయిరీలను నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నారని ధూళిపాళ్ల వివరించారు.
చట్ట పరిధిలోనే కార్యకలాపాలు, వ్యాపారం జరుగుతోందని నరేంద్ర చెప్పారు. ఏపీ ప్రభుత్వం అమూల్ డెయిరీని తీసుకొచ్చి స్థానికంగా ఉండే వాటిని దెబ్బతియాలని యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అమూల్ కోసం అప్పులు తెచ్చి పెట్టుబడులు సైతం పెడుతోందని ధూళిపాళ్ల వెల్లడించారు.