హైకోర్టులో ఎదురుదెబ్బ... ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారంటే..: సజ్జల కీలక వ్యాఖ్యలు (వీడియో)
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అడ్డంకిని తొలగిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ కు ఏపీ హైకోర్టు గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. హై కోర్ట్ డివిజన్ బెంచ్ తీర్పును స్వాగతిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. ఈ తీర్పుతో పరిషత్ ఎన్నికలకు పట్టిన గ్రహణం వీడిందన్నారు.
''చంద్రబాబు హయాంలోనే స్థానిక ఎన్నికలు జరగాల్సింది. కానీ వాయిదా వేసుకుంటూ వచ్చారు. ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకునేందుకు కుట్ర చేశారు. అప్పటి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా వేశారు. గత మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉండగా ప్రభుత్వంతో చర్చించకుండానే ఎన్నికల ప్రక్రియను నిమ్మగడ్డ వాయిదా వేశారు. చివరకు ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఏకగ్రీవాలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేసారు. ఇలా ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేశారు'' అని సజ్జల మండిపడ్డారు.
వీడియో
''టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలనే ఎస్ఈసి నిమ్మగడ్డ పాటించారు. ప్రజాస్వామ్య ప్రక్రియను హత్య చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. గతంలో ఎన్నికల ప్రక్రియను, కౌంటింగ్కు అడ్డుపడ్డవారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది'' అని అన్నారు.
read more నీలం సాహ్నికి ఊరట: ఎపి పరిషత్ ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
''ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగ్గా ఫలితాలు మాత్రం వెలువడలేదు. కోర్టు తీర్పుతో అడ్డంకులు తొలగిపోయాయి కాబట్టి ఓట్ల లెక్కింపు పూర్తయితే వైసిపి అభ్యర్థులు భారీ విజయం అందుకుంటారు. అప్పుడు చంద్రబాబు ఓటమి నెపాన్ని ఈవీఎంల మీద నెడతారు'' అని సజ్జల పేర్కొన్నారు.
ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు తీర్పుపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కూడా స్పందించారు. గౌరవ న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కేసుల పేరుతో ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు హక్కు కాలరాయాలని ప్రయత్నాలు చేసిందన్నారు. కోర్టులో కేసులు వేస్తూ అటు గౌరవ న్యాయస్థానాల సమయాన్ని కూడా వృధా చేసిందన్నారు. అయితే కోర్టు తీర్పుతో పరిషత్ ఓట్ల కౌంటింగ్ జరగనుందని... ఇందులో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు నూటికి నూరు శాతం గెలుస్తారన్ననమ్మకంం తమకు వుందని ఆళ్ల పేర్కొన్నారు.