శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తేనే అవినాశ్ రెడ్డి (avinash reddy) వివేకా ఇంటికి వెళ్లారని వైసీపీ నేత, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అందరూ వివేకా కేసులో వాస్తవాలు బయటకు రావాలని కోరుకుంటున్నారని సజ్జల స్పష్టం చేశారు. సీబీఐ కూడా ఒక పథకం ప్రకారం వైసీపీ నేతల్ని ఇరికించే కుట్ర చేస్తోందని సజ్జల ఆరోపించారు.
వివేకా హత్య కేసుపై (ys viveka murder case) కొందరు దుష్ఫ్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నేత, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna Reddy). మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు జరిగిన వివేకా హత్య , జగన్ను (ys jagan) బాగా కుంగదీసిందని సజ్జల చెప్పారు. వివేకా హత్యపై సీబీఐ (cbi) ఛార్జ్షీట్ పేరుతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. సీబీఐ ఛార్జ్షీట్ అంటూ కేసుతో సంబంధం లేనివారిపై కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అవినాశ్ గెలుపు కోసం వివేకా ప్రచారం చేశారని.. వివేకా హత్య కుట్ర కంటే ఇప్పుడు పెద్ద కుట్ర జరుగుతోందని సజ్జల మండిపడ్డారు.
శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తేనే అవినాశ్ రెడ్డి (avinash reddy) వివేకా ఇంటికి వెళ్లారని ఆయన తెలిపారు. అందరూ వివేకా కేసులో వాస్తవాలు బయటకు రావాలని కోరుకుంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వివేకాది మర్డర్ అని బయటపెట్టే లెటర్ను ఆరోజు సాయంత్రం వరకు ఎందుకు బయటపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. సీబీఐ కూడా ఒక పథకం ప్రకారం వైసీపీ నేతల్ని ఇరికించే కుట్ర చేస్తోందని సజ్జల ఆరోపించారు. మార్చి 15న కేసు రిజిస్టర్ అయినప్పుడు టీడీపీ ప్రభుత్వమే అధికారంలో వుందని.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కూడా అదే అధికారులు కంటిన్యూ అయ్యారని ఆయన చెప్పారు. కొందరి పేర్లు చెప్పాలంటూ తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని అనుమానితులు ఆరోపిస్తున్నారని రామకృష్ణారెడ్డి తెలిపారు.
కాగా.. YS Vivekananda Reddyని కడప ఎంపి YS Avinash Reddy తన అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్రెడ్డి ద్వారా హత్య చేయించారని అనుమానం ఉందంటూ సీబీఐ బాంబు పేల్చింది. ఆ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. కడప లోక్సభ నియోజకవర్గం టికెట్ అవినాష్ రెడ్డికి కాకుండా తనకు లేదా వైయస్ షర్మిల, విజయమ్మల్లో ఎవరికైనా ఒకరికి రావాలని వివేకానందరెడ్డి ఆకాంక్షించారని…ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి ఆయనను హత్య చేయించి ఉంటారని అనుమానం ఉందని వివరించింది. తమ దర్యాప్తులో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి అని పేర్కొంది. హత్య వెనుక ఉన్న భారీ కుట్రను వెలికి తీసే దిశగా దర్యాప్తు సాగిస్తున్నామని వెల్లడించింది. ఇప్పటివరకు దర్యాప్తులో గుర్తించిన అంశాలను CBI అందులో ప్రస్తావించింది.
ప్రధానాంశాలు ఇవి…
వివేకానంద చంపినట్లు అంగీకరిస్తే రూ. పది కోట్లు..
వివేకానంద రెడ్డి హత్యానేరాన్ని నీపై వేసుకొని, అతని నువ్వే చంపిన్నట్లు అంగీకరిస్తే రూ.10 కోట్లు ఇస్తామని గంగిరెడ్డి అనే వ్యక్తికి దేవిరెడ్డి శివశంకర్రెడ్డి ఆఫర్ చేశారు. నిందితుల్లో ఒకరైన దస్తగిరి సిబిఐ అధికారులు విచారణ కోసం ఢిల్లీకి పిలిపించిన విషయం శివశంకర్ రెడ్డికి తెలిసింది. సీబీఐకి తమ పేర్లు చెప్పకుండా ఉంటే జీవితం సెటిల్ చేస్తామంటూ ఆయన దస్తగిరికి హామీ ఇచ్చారు. ఢిల్లీలో దస్తగిరి కదలికలు కనిపెట్టేందుకు సిబిఐ ఆయనను ఏం ప్రశ్నిస్తుందో తెలుసుకునేందుకు భరత్ యాదవ్ ను అక్కడికి పంపించారు. 2019 ఫిబ్రవరి 10నే వివేకాహత్యకు ప్రణాళిక సిద్ధమైంది. ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో జరిగిన ఈ కుట్రలో దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి భాగస్వాములయ్యారు.
ఎమ్మెల్సీగా పోటీ కి అడ్డు తగిలారని..
వివేకా హత్యకు కుట్ర హత్య తర్వాత ఆధారాల ధ్వంసంలో పాల్గొన్న దేవిరెడ్డి శివశంకర్రెడ్డి కడప జిల్లా వైసీపీలో కీలక నేత. 2017లో కడప స్థానిక సంస్థల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. దీంతో ఆ స్థానంలో పోటీ చేసిన వివేకాకు మద్దతు ఇవ్వలేదు. ఓటమిపాలైన వివేకా.. శివశంకర్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు వివేకా వైసీపీలో చేరితే రాయలసీమలో తన ప్రాబల్యానికి ఇబ్బంది అవుతుందని భావించిన శివశంకర్ రెడ్డి.. ఆయన చేరిక పైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
హత్య ప్రణాళికలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి
‘వివేకానంద హత్య చేస్తే శివశంకర్రెడ్డి 40 కోట్లు ఇస్తారు. అందులో నీకు 5 కోట్లు ఇస్తాం. చేస్తే నీ జీవితం సెటిల్ అయిపోతుంది. వైఎస్ అవినాశ్రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి హత్య ప్రణాళికలో ఉన్నారు’ అని ఎర్ర గంగిరెడ్డి దస్తగిరితో చెప్పారు. వివేక మృతి వార్త వెలుగు చూసిన తర్వాత 2010 మార్చి 15న ఉదయం 6.25 గంటలకు కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, ఇతర సన్నిహితులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వైఎస్ భాస్కర్రెడ్డి, మనోహర్ రెడ్డి, వైయస్ ప్రతాపరెడ్డి, ఎర్ర గంగిరెడ్డి కూడా అక్కడికి చేరారు. మృతదేహం రక్తపు మడుగులో ఉన్న.. ఆయన గుండెపోటుతో మరణించారు అంటూ అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ప్రచారం మొదలుపెట్టారు. ఇదే మాటను శివ శంకర్ రెడ్డి సాక్షి టీవీలో తొలిసారి చెప్పాడు. వివేకా కుమార్తె, జె.డి అల్లుడు రాకుండానే ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయత్నించారు.
వ్యక్తిగత కక్షలతో హత్య కుట్ర లోకి…
గంగిరెడ్డి, షేక్ దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డిలు వ్యక్తిగత కక్షలతో వివేకా హత్య కుట్టడం భాగస్వాములయ్యారు. 2017 లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా ఓటమికి పని పనిచేసే వివేకా తరచూ ఎర్ర గంగిరెడ్డిని తిట్టేవారు. బెంగళూరులో ఓ వివాదాన్ని సెటిల్ చేసినందుకు వివేకా రూ. 8 కోట్లు ఆశించారు. దాంతో తనకు వాటా ఇవ్వాలని గంగిరెడ్డి అడిగినా వివేకా ఇవ్వలేదు. వివేక ఆస్తులకు బినామీగా, ఆయన వెన్నంటే ఉన్నా, పంచాయితీ ఎన్నికల్లో తమ కుటుంబానికి అవకాశం ఇవ్వలేదని ఉమా శంకర్ రెడ్డి, డ్రైవర్ గా తీసేశారని షేక్ దస్తగిరి ఆయనపై కక్ష పెంచుకున్నారు.
హత్య సమయంలో… సునీల్ యాదవ్ అక్కడే…
- 2019 మార్చి 15వ తేదీ తెల్లవారుజామున 2.42 గంటల ఈ సమయంలో sunilyadav వివేక ఇంట్లో ఉన్నట్లు ఆయన జిమెయిల్ ఖాతాకు సంబంధించిన గూగుల్ కోఆర్డినేటర్ ద్వారా వెల్లడైంది. హత్య జరిగిన రోజు, మర్నాడు సునీల్, దస్తగిరిల మధ్య పెద్ద ఎత్తున ఫోన్ కాల్, ఎస్ఎంఎస్లు నడిచాయి.
- హత్య జరిగిన రోజు రాత్రి వివేక ఇంటి ముందు నుంచి ఉమా శంకర్ రెడ్డి పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
- ఎర్ర గంగిరెడ్డి దిశానిర్దేశం తో సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దస్తగిరిలు హత్య ప్రణాళిక అమలు చేశారు. హత్య కుట్ర రూపొందించిన నాలుగైదు రోజుల తర్వాత సునీల్ దస్తగిరికి రూ.కోటీ ఇచ్చాడు. ఉమా శంకర్ రెడ్డి, సునీల్ కూడా రూ.కోటీ చొప్పున పొందారు. దస్తగిరి తనకు వచ్చిన డబ్బుల్లో రూ.46.70 లక్షలు మున్నా అనే స్నేహితుడు వద్ద ఉంచగా సీబీఐ స్వాధీనం చేసుకుంది.
- పోలీసులకు మా పేరు చెబితే నిన్ను చంపేస్తామంటూ వాచ్ మెన్ రంగన్న గంగిరెడ్డి బెదిరించాడు.
- దేవిరెడ్డి శివశంకర్రెడ్డి వివేకా హత్య విషయాన్ని దాచి పెడుతూ ఆయన కృష్ణారెడ్డి తో పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. మృతదేహంపై తీవ్ర గాయాలు ఉన్నాయని, పడక గదిలోనూ, స్నానాల గదిలోనూ రక్తపు మడుగు ఉందని విషయాలేవీ ఫిర్యాదులు ప్రస్తావించకుండా దాచిపెట్టారు. దాని ఆధారంగా కేసు నమోదు చేయాలని సిఐ శంకరయ్య పై ఒత్తిడి తీసుకొచ్చారు ‘ సార్.. శివ శంకర్ రెడ్డి, గంగిరెడ్డి లు ఘటనా స్థలాన్ని ఎందుకు శుభ్రపరుస్తున్నారు? వారు ఆధారాలు ధ్వంసం చేస్తే కేసు సంక్లిష్టం అవుతుంది’ అని సిఐ శంకరయ్య అక్కడున్న వైయస్ ప్రతాపరెడ్డి తో అన్నారు.
- నార్కో అనాలసిస్ పరీక్షకు శివ శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి ఒప్పుకోలేదు.
- వివేకా తల, ముదురు, అరచేతిపై ఏడు గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. హేమరేజిక్ షాక్ తో పాటు మెదడుకు తీవ్ర గాయాలు అవటంవల్ల చనిపోయారని నివేదికలో వెల్లడయ్యింది. గొడ్డలితో వివేకానంద హత్య చేసి ఉండొచ్చని శవపరీక్ష చేసిన వైద్యులు వెల్లడించారు.
