Asianet News TeluguAsianet News Telugu

ఓటమి భయంతోనే.. దొంగఓట్ల నాటకం : చంద్రబాబు పై సజ్జల ఫైర్

సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు అన్ని ఎన్నికలలో పార్టీని గెలిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో కూడా పార్టీ ఘన విజయం సాధించింది. ఇవాళ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నిక జరుగుతోంది. అయితే ఈ ఎన్నికలో 6 సెగ్మెంట్లలో ఎక్కడా ఏం లేకుండా ప్రశాంతంగా పోలింగ్‌ జరుగుతుంటే, తిరుపతిలో చంద్రబాబు విశ్వరూపం చూపిస్తున్నాడు

sajjala ramakrishna reddy press meet points - bsb
Author
Hyderabad, First Published Apr 17, 2021, 5:39 PM IST

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. 

తిరుపతిలో పోలింగ్ సందర్బంగా టీడీపీ, బీజేపీ ఓటమికి సాకులు వెతుక్కుంటూ, దొంగ ఓట్లు అంటూ కుట్ర చేస్తున్నాయన్నారు. అసలు దొంగ ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం తమకు లేదని, మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా వైయస్సార్‌సీపీకి అద్భుత విజయం సాధించిందని, అదే స్ఫూర్తితో తిరుపతి ఎన్నికలో కూడా ప్రజలు గెలిపిస్తారన్నారు. 

తమకు దొంగ ఓట్లు, అక్రమాలు, కుట్రలు అవసరం లేదన్నారు. అదంతా టీడీపీ, చంద్రబాబు సొంతం అన్నారు. పక్కా ప్రణాళికతో వైసీపీ మీద ఈ కుట్ర చేస్తున్నారని 
వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
 
సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్‌ మీట్‌ పాయింట్స్‌ ఇంకా ఇలా ఉన్నాయి..

‘వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక తొలిసారి ఒక పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికలో ఎక్కడా అధికార దుర్వినియోగం చేయకుండా, ఓటర్లను ప్రలోభపెట్టకుండా, డబ్బు మద్యం పంపిణీ లేకుండా, ఓటర్లు తాము కోరుకున్న వారికే ఓటు వేసే విధంగా వెసులుబాటు కల్పించాం. ఈ ఎన్నిక ప్రశాంతంగా జరగడంలో ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి పూర్తి సహకారం అందిస్తోంది. గతంలో ఏనాడూ లేని విధంగా ఈ ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరుగుతోంది’ అని అన్నారు.

వాళ్లంతా భక్తులు.. దొంగ ఓట్లు వేసే ఖర్మ వైసీపీకి పట్టలేదు: చంద్రబాబుకు పెద్దిరెడ్డి చురకలు...

రెచ్చిపోయిన చంద్రబాబు : ‘సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు అన్ని ఎన్నికలలో పార్టీని గెలిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో కూడా పార్టీ ఘన విజయం సాధించింది. ఇవాళ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నిక జరుగుతోంది. అయితే ఈ ఎన్నికలో 6 సెగ్మెంట్లలో ఎక్కడా ఏం లేకుండా ప్రశాంతంగా పోలింగ్‌ జరుగుతుంటే, తిరుపతిలో చంద్రబాబు విశ్వరూపం చూపిస్తున్నాడు’ అని మండిపడ్డారు.

‘దొంగ ఓటర్లను తీసుకువస్తున్నారని అబద్ధం చెబుతున్నాడు. నాడు తన మామను దింపినప్పుడు ఏం కుట్ర చేశాడో, ఎలా మాట్లాడాడో ఇప్పుడు కూడా అదే కుట్ర ధోరణితో మాట్లాడుతున్నాడు. అసెంబ్లీని రద్దు చేస్తే ఎమ్మెల్యేలు దగ్గరకు వస్తారని ఎన్టీఆర్‌ను తప్పుదోవ పట్టించి, ఆ విధంగా ప్రకటన చేయించి, ఆ తర్వాత ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికల భయం పెట్టి, తన వైపు లాక్కుని, చివరకు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, అధికారంలోకి వచ్చాడు’ అని దుయ్యబట్టారు.

‘తిరుపతిలో ఇంత దారుణంగా వ్యవహరిస్తారని మేము పెద్దగా ఊహించలేదు. ఇంత డ్రామాకు తెర లేపుతాడని అనుకోలేదు. తిరుపతికి ఎక్కడెక్కడి నుంచో బస్సులు వస్తున్నాయని, వాటి నెంబర్లు చెబుతూ సీఈఓకు నిన్న అర్ధరాత్రి లేఖ రాశాడు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇదంతా ఒక్క పక్కా  ప్రణాళికతో చేస్తున్నారు.
ఈ డ్రామాకు తిరుపతిని ఎందుకు వేదికగా ఎంచుకున్నాడంటే, అక్కడికి రోజూ వందల బస్సులు వస్తాయి. లక్షల సంఖ్యలో ప్రజలు వస్తారు కాబట్టి. ఉదయం నుంచే ఏబీఎన్, టీవీ5, ఈటీవీ రోడ్ల మీద పడి, బస్సుల్లో వస్తున్న వారిని నిలదీస్తున్నాయి. ప్రశ్నలు వేసి బెదిరిస్తున్నాయి’ అని విరుచుకుపడ్డారు. 

పెద్దిరెడ్డి పుంగనూరు వీరప్పన్... నారాలోకేష్ ఫైర్...

ఇది కుట్ర కాదా? : ‘ఎప్పుడైతే కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారో.. నిజంగా అదే జరిగి ఉంటే, దొంగ ఓటర్లు వచ్చి ఉంటే, ఇవాళ చేస్తున్నట్లు హడావిడి చేసే వారా? నిన్న అర్ధరాత్రి సీఈఓకు లెటర్‌ రాశారు. ఏవేవో బస్సుల నెంబర్లు రాసి, దొంగ ఓటర్లు వస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. అసలు ఎక్కడైనా దొంగ ఓట్లు పోలింగ్‌ బూత్‌లో వేస్తారు. అక్కడ అన్ని పార్టీల పోలింగ్‌ ఏజెంట్లు ఉంటారు కదా? వారు పట్టుకుంటారు కదా? నిజంగా దొంగ ఓటర్లు వస్తే, సులభంగా పట్టుబడతారు కదా? నిజంగా ఎవడైనా బస్సుల్లో ఓట్ల కోసం ప్రజలను తీసుకువస్తారా? నిజం చెప్పాలంటే ఆ పని నీవు చేస్తావు?. మరి ఇది కుట్ర కాక మరేమిటి?’ అని చంద్రబాబుకు సూటి ప్రశ్న వేశారు. 

‘ఎన్నికల్లో ఓటింగ్‌ ప్రక్రియ ఎలా ఉంటుందో, పోలింగ్‌ కేంద్రంలో ఒక ఓటరును ఎలా అనుమతిస్తారో తెలిసి కూడా చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు’ అన్నారు. ‘మొత్తంగా నాలుగు జాతీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేశాయని చంద్రబాబు అన్నాడు. బిజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం. వీటితో పాటు టీడీపీ ఇలా మొత్తంగా మాకు ప్రతిపక్షమైన అయిదు పార్టీలు ఎన్నికల బరిలో ఉన్నాయి. అంటే ప్రతి ఎన్నికల బూత్‌లోనూ మా ఏజెంట్‌ ఒకడుంటే, వారి ఏజెంట్లు అయిదుగురు ఉన్నారు. మరి దొంగ ఓట్లు వేయించగల శక్తి కానీ, అవకాశం కానీ, ఖర్మ కానీ ఉంటే చంద్రబాబుకో, ఇతర పార్టీలకో ఉండాలి తప్ప, మాకు ఎందుకు ఉంటుంది?’ అన్నారు. 

‘ఎన్నికలు నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. అక్కడ కేంద్ర బలగాలు ఉన్నాయి. పరిశీలకులు ఉన్నారు. చివరకు పోలింగ్‌ బూత్‌లలో ఏజెంట్లు. ఇంతమందిని దాటుకుని ఎవరైనా దొంగ ఓట్లు వేస్తారా? అలా ఓట్లు వేసేందుకు బస్సుల్లో వస్తారా?’ అని ప్రశ్నించారు.

‘లక్షల ఓట్ల తేడాతో ఓడిపోబోతున్నాం అన్న కడుపు మంటే చంద్రబాబు మాటల్లో కనిపిస్తోంది. సాకులు వెతుక్కుంటున్నాడు. అది ఆయనకు అలవాటు. ఓటమి తప్పదన్న ప్రతిసారి అలా అసత్యాలు ప్రచారం చేస్తాడు. అంతకన్నా దారుణం ఏమన్నా ఉంటుందా?. అసలు మాకు దొంగ ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం ఏముంది? పంచాయతీ ఎన్నికల్లో మాపార్టీ మద్దతుదారులు గెల్చినా, తామే గెల్చామని చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. ఎందుకంటే అవి పార్టీల గుర్తుల మీద జరిగే ఎన్నికలు కాదు కాబట్టి. పైగా సంబరాలు కూడా చేశారు. ఆ తర్వాత మున్సిపల్‌ ఎన్నికల్లో ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు వచ్చేసరికి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాడు’ ఇది చంద్రబాబు వైఖరి అంటూ దుయ్యబట్టారు..

‘అన్ని విధాలుగా ఓడిపోతున్న చంద్రబాబుకు, అసలు తాను ఏం చేశాడన్నది చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆయన కుమారుడు కూడా అలాగే తయారయ్యాడు. పోనీ తాము గెలిస్తే ఏం చేస్తామన్నది కూడా చెప్పడం లేదు. ప్రభుత్వంపై విమర్శించడానికి ఏమీ లేకపోవడంతో, సీఎం శ్రీ వైయస్‌ జగన్‌పై లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారు’ అని చంద్రబాబు, లోకేష్ లపై మండిపడ్డారు.

ఎన్నికల ప్రక్రియ భగ్నానికి యత్నం : ‘ఇవాళ మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫోన్‌ చేయడం, ఫిర్యాదు చేయడం, లేఖ రాయడం, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం చాలా హేయం. ఆ విధంగా మొత్తం ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియను, కేంద్ర ఎన్నికల సంఘాన్ని తప్పు పడుతున్నారు. చంద్రబాబు, ఆయన అనుయాయులు చాలా హేయంగా ప్రవర్తిస్తున్నారు. ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియకే భగ్నం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు’. అన్నారు.

జగన్ అనే వ్యక్తి కోసం కాదు: తిరుపతి ఎన్నికపై చంద్రబాబు అసహనం...

తిరుపతిలో మాకు స్పష్టమైన మెజార్టీ : ‘మొన్న తిరుపతి మున్సిపల్‌ ఎన్నికల్లో సగం డివిజన్లలో జరిగిన పోలింగ్‌లో మాకు వచ్చిన మెజారిటీ దాదాపు 30 వేలు. మిగతావి ఏకగ్రీవమయ్యాయి. అంటే మొత్తం డివిజన్లలో చూస్తే, మాకు 50 నుంచి 60 వేల మెజారిటీ వస్తుంది. అసలు మాకు దొంగ ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం ఏమిటి? దానికి పెద్దిరెడ్డి తిరుపతిలో ఎందుకు ఉన్నారని ప్రశ్నించడం, ఆయనపై విమర్శలు చేస్తున్నారు. మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తిరుపతిలో ఇల్లు ఉంది. అందుకే ఆయన అక్కడ ఉన్నారు’ అన్నారు.

‘మాకు తిరుపతిలో బలం లేకపోతే కదా?. మేము ఎందుకు దొంగ ఓట్ల కోసం పాకులాడుతాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క తిరుపతిలోనే కాకుండా మొత్తం రాష్ట్రమంతా కూడా మొత్తం ఓటర్లలో 70 నుంచి 80 శాతం జగన్‌మోహన్‌రెడ్డి గారిని సమర్థిస్తున్నారు. అలాంటప్పుడు మాకు ఆ కర్మ ఎందుకు?’ అంటూ ఎద్దేవా చేశారు.

‘నిజం చెప్పాలంటే అలాంటి కుట్రలు, కుతంత్రాలు చేయడం మీకు అలవాటు. అసత్యాలు చెప్పడం, దుష్ప్రచారం చేయడం మీకు బాగా వచ్చు. అయితే అది కూడా చాలా వ్యవస్థీకృతంగా చేస్తారు. ఇవాళ పొద్దటి నుంచే ఎల్లో మీడియా తిరుపతి రోడ్ల మీద పడింది. బస్సుల్లో వస్తున్న వారిని దబాయిస్తున్నారు. వాళ్లలో కొందరిని వీళ్లే అరెంజ్‌ చేశారు. వారిని ప్రశ్నించడం, వారు కావాలనే సమాధానం చెప్పకపోవడం, ముఖం చాటేయడం చేస్తున్నారు. లేదా ఏదో సమాధానం చెప్పిస్తున్నారు. అలా వారంతా దొంగ ఓట్లు వేయడానికి వచ్చారంటూ, వారిని మేమే తెస్తున్నామంటూ ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. వాటిని పదే పదే చూపిస్తున్నారు. మరోవైపు వాటిపై ఇక్కడ సీఈఓకు, అక్కడ ఢిల్లీలో ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారు’ ఇదెక్కడి న్యాయం అన్నారు.

‘అంటే రేపు ఓడిపోయినట్లు ప్రకటన రాగానే, ఏం చెప్పాలన్నది ఆయన ఇప్పుడే చెబుతున్నాడు. తాము గెలిచే వారమేనని, కానీ ఇలా దొంగ ఓట్లు వేయడం వల్ల ఓడిపోయామని చెబుతాడు. నిజంగా మేము అధికార దుర్వినియోగానికి పాల్పడితే, పోలీసులు మమ్మల్ని వదిలేయాలి కదా? కానీ అలా వారేమీ లేరు కదా? అదే విధంగా నిజంగా దొంగ ఓట్లు వేయడానికి వస్తే పోలీసులు పట్టుకుంటారు కదా? ఇక పోలింగ్‌ బూత్‌లలో మీ ఏజెంట్లు లేరా? దొంగ ఓట్లు వేయడానికి వస్తే, వారు అడ్డుకోరా? వారు నిద్ర పోతున్నారా? ఇదంతా ఓటమికి సాకులు చెప్పడమే’ అన్నారు.

‘కేవలం సాకు చెప్పడానికే చంద్రబాబు ఈ కుట్ర చేస్తున్నారు. వైయస్సార్సీపీ ఇలా దొంగ ఓట్లు వేసుకుంది కాబట్టే, తాము ఓడిపోయామని రేపు ఆయన చెప్పబోయే మాటలే నేను ఇప్పుడు చెబుతున్నాను. కానీ చంద్రబాబు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. సీఎం వైయస్‌ జగన్‌కు పూర్తి ప్రజా మద్దతు ఉంది. ఇలా దొంగ ఓట్లు వేయించుకోవాల్సిన కర్మ ఆయనకు పట్టలేదు. పైగా, ఆయనకు ఇలాంటి ఆలోచనలు కూడా రావు. ఆయన చాలా నిజాయితీతో పని చేస్తున్నారు’ అంటూ చెప్పుకొచ్చారు.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..: ‘మొత్తం ఎన్నికను రద్దు చేయాలని, రీపోలింగ్‌ జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు. కానీ మేము దేనికీ భయపడం. ఎన్నిసార్లు అయినా ఎన్నికలను ఎదుర్కొంటాం. ఎన్నికలు మళ్లీ మళ్లీ జరిగితే మా మెజారిటీ ఇంకా పెరుగుతుంది. అందుకే మాకేమీ భయం లేదు’ అని సమాధానం ఇచ్చారు. 

‘మేము బీజేపీ వాళ్లను అడుగుతున్నాం. ఈ ఎన్నిక నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. అక్కడ కేంద్ర బలగాలు పని చేస్తున్నాయి. అలాంటప్పుడు దొంగ ఓట్లు ఎలా వేస్తారు? పోలింగ్‌ బూత్‌లలో మీ ఏజెంట్లు కూడా ఉన్నారు కదా?. దొంగ ఓట్లు వేస్తే వాళ్లు అడ్డుకుంటారు కదా?. పైగా కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు కూడా ఉన్నారు. వారు అన్నీ చూస్తున్నారు కదా?. వాస్తవాలు గుర్తిస్తారు కదా?. ఒక వేళ తిరిగి ఎన్నికలు నిర్వహించినా, ఇంకా చెప్పాలంటే ఎన్ని సార్లు జరిపినా, మేము ఎదుర్కొంటాము. మా మెజారిటీ ఇంకా పెరుగుతుంది తప్ప, తగ్గదు’.. అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్‌మీట్‌ ముగించారు.

Follow Us:
Download App:
  • android
  • ios