ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) పీఆర్సీ వివాదాన్ని కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. ఈ క్రమంలోనే శుక్రవారం పీఆర్సీ సాధన సమితితో మంత్రుల కమిటీ సుదీర్ఘంగా చర్చలు జరిపింది. తాజాగా ఉద్యోగలు పీఆర్సీకి సంబంధించి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.  

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) పీఆర్సీ వివాదాన్ని కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. ఈ క్రమంలోనే శుక్రవారం పీఆర్సీ సాధన సమితితో మంత్రుల కమిటీ సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఈ చర్చలు సానుకూలంగా జరిగాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) వెల్లడించిన సంగతి తెలిసిదే. తాజాగా శనివారం ఉదయం ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఫిట్‌మెంట్ 23 శాతంలో ఎలాంటి మార్పు ఉండదని అన్నారు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబుల సవరణలతో ప్రభుత్వంపై అదనంగా రూ. 7వేల కోట్ల భారం పడుతుందని చెప్పారు. హెచ్‌ఆర్‌ఏ పాత శ్లాబులే కొనసాగించాలని ఉద్యోగులు కోరారని తెలిపారు. కనీస హెచ్‌ఆర్‌ఏ 12 శాతం ఉండాలని ఉద్యోగులు అడిగినట్టుగా చెప్పారు. 

మరోవైపు పీఆర్సీకి, ఉద్యోగుల డిమాండ్లకు సంబంధించి మంత్రుల కమిటీ సీఎం జగన్‌తో సమావేశం అయింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరుగుతుంది. శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పీఆర్సీ సాధన సమితి నాయకులతో జరిగిన చర్చల సారాంశాన్ని మంత్రుల కమిటీ సీఎం జగన్‌ను వివరిస్తున్నారు. వారి ముందు ఉద్యోగ సంఘాల నాయకులు పెట్టిన ఇతర అంశాలను కూడా సీఎం దృష్టికి మంత్రుల కమిటీ తీసుకెళ్లనుంది. హెచ్‌ఆర్‌ఏ, పెన్షన్ శ్లాబుల్లో మార్పులు, రికవరీ మినహాయింపుల వల్ల పడే ఆర్థిక భారంపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ భేటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ‌లతో పాటుగా ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు. 

ఈ సమావేశంలో ఆర్థికపరమైన అంశాలపై సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఎం జగన్‌తో భేటీ అనంతరం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పీఆర్సీ సాధన సమితి నాయకులతో మంత్రుల కమిటీ మరోసారి సమావేశం కానుంది. ఇక, చర్చలు కొనసాగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు యధావిధిగా పెన్ డౌన్, యాప్ డౌన్ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇక, శుక్రవారం ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ సుదీర్ఘంగా సాగింది. పీఆర్సీ, ఐఆర్, హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు, సీసీఏ కొనసాగింపు, ఫిట్‌మెంట్‌ పెంచడం, సీపీఎస్‌ రద్దు.. తదితర అంశాలపై మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి నాయకులు చర్చలు జరిపారు. అయితే ఈ చర్చల్లో కొన్నింటిపై స్పష్టమైన హామీ లభించగా.. మరికొన్నింటిపై అస్పష్టత నెలకొంది. ఐఆర్‌ను వేతనాల నుంచి రికవరీ చేయబోమని, పీఆర్‌సీని ఐదేళ్లకు ఒకసారి వేస్తామని మంత్రుల కమిటీ నుంచి ఉద్యోగ సంఘాలకు స్పష్టమైన హామీ లభించింది. ఇదిలా ఉంటే.. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు, సీసీఏ కొనసాగింపు, ఫిట్‌మెంట్‌ పెంచడం, సీపీఎస్‌ రద్దుపై మాత్రం ఎలాంటి హామీ లభించలేదు.