టీడీపీ, జనసేనలు ముందు వాళ్ల ఇంటిని చక్కదిద్దుకోవాలని  వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చురకలంటించారు.  మార్పులు చేర్పులు అనేవి తమ పార్టీ అంతర్గత వ్యవహారమని ఆయన పేర్కొన్నారు.  బీసీల స్థానాల్లో చంద్రబాబు, లోకేష్‌లు ఎందుకు పోటీ చేస్తున్నారని సజ్జల ప్రశ్నించారు. 

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో వైసీపీలో కలకలం రేగింది. ఆ వెంటనే రాష్ట్రంలోని 11 నియోజకవర్గాల వైసీపీ బాధ్యులను జగన్ మార్చేశారు. అంతేకాదు రానున్న రోజుల్లో మరిన్ని మార్పులు వుంటాయని కూడా ఆయన సంకేతాలు పంపారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గెలుపు అవకాశాలను మెరుగుపరచడానికే మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ, జనసేనలు ముందు వాళ్ల ఇంటిని చక్కదిద్దుకోవాలని సజ్జల చురకలంటించారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో, ఎక్కడ పోటీ చేయాలో ఆ రెండు పార్టీలకు ఇప్పటి వరకు స్పష్టత లేదని రామకృష్ణారెడ్డి అన్నారు. మార్పులు చేర్పులు అనేవి తమ పార్టీ అంతర్గత వ్యవహారమని ఆయన పేర్కొన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వైఎస్ జగన్‌ను నారా లోకేష్ ఇమిటేడ్ చేస్తుంటారని.. లోకేష్ 3000 కిలోమీటర్ల పాదయాత్ర ఎక్కడ చేశాడో ఎవరికీ తెలియదని రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. నాయకుడిని మార్చితే కింద వున్న క్యాడర్ ఇబ్బందిపడటం సహజమని, అయితే ఎలా గెలవాలో..? గెలవాలంటే ఏం చేయాలనే స్ట్రాటజీ మాకుందని సజ్జల పేర్కొన్నారు. చిన్న చిన్న చికాకులను సరిదిద్దటం పెద్ద విషయం కాదని ఆయన అన్నారు. 175కు 175 స్థానాల్లో వైసీపీ గెలవడం ఖాయమని.. బీసీల స్థానాల్లో చంద్రబాబు, లోకేష్‌లు ఎందుకు పోటీ చేస్తున్నారని సజ్జల ప్రశ్నించారు. అందరినీ పిలిచి మాట్లాడతామని.. మా పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో తమకు తెలుసునని రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. 

ALso Read: జగన్‌ గెలవాల్సిందే , వైసీపీలో ఇంకా చాలా మార్పులు జరుగుతాయ్ .. వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు

అంతకుముందు ఇదే వ్యవహారంపై వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో వైసీపీని గెలిపించుకోవాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్ధితుల దృష్ట్యా మార్పులు, చేర్పులు చేస్తున్నామని.. గాజువాకలోనూ సమన్వయకర్తని మార్పు చేయనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. రెండు వారాల క్రితమే ఎమ్మెల్యే నాగిరెడ్డికి సమాచారం ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీలో చాలా మార్పులు వుండబోతున్నాయని.. లోకేష్ 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారని , దీని వల్ల టీడీపీలోకి ఎలాంటి వలసలు వుండబోవని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.