అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ వాస్తవం, త్వరలోనే నిజాలు : సుప్రీం తీర్పుపై సజ్జల వ్యాఖ్యలు
అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు గత సోమవారం నాడు కొట్టేసింది. దీనిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతి అనేది పెద్ద స్కాంగా అభివర్ణించారు. అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నది అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ లేదని సాంకేతిక అంశాలతోనే కోర్టులో తీర్పు వచ్చిందని సజ్జల తెలిపారు. మరో కోణంలో వాస్తవాలు బయటకు వస్తాయని రామకృష్ణారెడ్డి వెల్లడించారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామంటే ఎవరు అడ్డుకుంటారని ఆయన ప్రశ్నించారు. మేం ప్రతిపక్షంలో రాజీనామాలు చేసినప్పుడు టీడీపీ వారిని అడిగామానా అని సజ్జల నిలదీశారు. రాజీనామాల గురించి మమ్మల్ని అడగటం ఎందుకు అని సజ్జల ప్రశ్నించారు.
Also Read:జగన్ సర్కార్కి సుప్రీం షాక్: అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ పై దాఖలైన పిటిషన్ కొట్టివేత
కాగా, అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు గత సోమవారం నాడు కొట్టేసింది. గతంలో ఏపీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.