జగన్ ను కలసిన రష్యన్లు..ఏమడిగారో తెలుసా ?
- రష్యాకు చెందిన వాళ్ళు కొందరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి వాకాబు చేసారు.
రష్యాకు చెందిన వాళ్ళు కొందరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి వాకాబు చేసారు. ఇంతకీ ఎప్పుడో మరణించిన వైఎస్ గురించి రష్యా వాళ్ళు ఎందుకు వాకాబు చేసారు? ఇంతకీ విషయం ఏమిటంటే, ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పాదయాత్రలో భాగంగా జగన్ అనంతపురం జిల్లా ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఆ సమయంలో కొందరు రష్యన్లు పాదయాత్రలో బిజిగా ఉన్న జగన్ ను కలిసారు.
వారిమధ్య జరిగిన సమావేశంలో నేరుగానే వారు జగన్ ను ఓ ప్రశ్న వేశారు. జిల్లాలో తాము ఎక్కడ తిరిగినా ఓ విగ్రహాన్ని చూసామని చెప్పారు. ఇంతకీ ఆ విగ్రహం ఎవరిది? ఎందుకు పెట్టుకున్నారంటూ నేరుగా జగన్నే అడిగారు. దాంతో జగన్ వారికి చిరునవ్వుతోనే సమాధానం చెప్పారు. పక్కనే ఉన్న నేతల్లో కొందరు జోక్యం చేసుకుని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిదిగా చెప్పారు. వైఎస్ కొడుకే జగన్ అంటూ పరిచయం చేసారు. అంటే, రష్యన్లు కూడా జగన్ గురించి తెలుసుకునే పాదయాత్ర దగ్గరకు వచ్చారు లేండి. వైఎస్ పాలనను, ప్రస్తుత చంద్రబాబు పాలనలోని తేడాను వైసిపి నేతలు రష్యన్లకు వివరించారు. ఒకవేళ వైసిపి అధికారంలోకి వస్తే పుట్టపర్తి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలంటూ కోరగా జగన్ కూడా సరేనంటూ హామీ ఇచ్చారు.