తాజా సర్వే: జగన్ దే ఆధిపత్యం, చంద్రబాబుకు షాక్
నేషనల్ అప్రూవల్ రేటింగ్స్ పేరిట జరిగిన ఈ సర్వే ఫలితాలను గురువారం రిపబ్లిక్ టీవీ వెల్లడించింది. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ తీవ్రంగా దెబ్బ తింటుందని సర్వే వెల్లడించింది.
హైదరాబాద్: తాజా సర్వే వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊపునిచ్చే విధంగా ఉంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని రిపబ్లిక్ టీవీ-సీ ఓటర్ సంస్థలు జరిపిన ఓ సర్వేలో వెల్లడైంది.
నేషనల్ అప్రూవల్ రేటింగ్స్ పేరిట జరిగిన ఈ సర్వే ఫలితాలను గురువారం రిపబ్లిక్ టీవీ వెల్లడించింది. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ తీవ్రంగా దెబ్బ తింటుందని సర్వే వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎపిలోని మొత్తం 25 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ 19 సీట్లు, టీడీపీకి కేవలం ఆరు సీట్లు గెలుచుకుంటాయని సర్వే తేల్చింది.
జాతీయపార్టీలు బీజేపీ, కాంగ్రెస్లకు ఒక్క స్థానం కూడా రాదని సర్వే వెల్లడించింది. ఓట్ల శాతం పరంగా చూసినా వైఎస్సార్సీపీదే పైచేయిగా కనిపించింది. వైఎస్సార్సీపీకి 41.3 శాతం ఓట్లు, టీడీపీకి 33.1 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. 2014 లోక్సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయగా ఏపీలో టీడీపీకి 15 సీట్లు, బీజేపీకి రెండు సీట్లు వచ్చాయి. అప్పుడు వైఎస్సార్సీపీ ఏపీలో 8 స్థానాలను గెలుచుకుంది.