ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ
ఆంధ్రప్రదేశ్లో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎపీఎస్ఎస్డీసీ)లో నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతోంది.
ఆంధ్రప్రదేశ్లో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎపీఎస్ఎస్డీసీ)లో నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతోంది. ఏపీ సీఐడీ దాఖుల చేసిన కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇప్పటికే 26 మందికి నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారిలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, ఏపీఎస్ఎస్డీసీ మాజీ సీఈవో గంటా సుబ్బారావు, ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్, రిటైర్డ్ అధికారి కె లక్ష్మీనారాయణ కూడా ఉన్నారు.
ఈ క్రమంలోనే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె లక్ష్మీనారాయణ నేడు హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఆయన ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. గతంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు లక్ష్మీనారాయణ డైరెక్టర్గా ఉన్న సంగతి తెలిసిందే.
ఇక, రూ. 241 కోట్ల నిధుల దుర్వినియోగానికి సంబంధించి అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, ఏపీఎస్ఎస్డీసీ మాజీ సీఈవో గంటా సుబ్బారావు, ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్, మాజీ ఐఏఎస్ అధికారి కె లక్ష్మీనారాయణ, ఓఎస్డీ నిమ్మగడ్డ వెంకట కృష్ణప్రసాద్ ఓఎస్డీతో సహా 26 మందిపై ఏపీ సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఏపీ సీఐడీ బృందాలు హైదరాబాద్లోని గంటా సుబ్బారావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ నివాసాల్లో సోదాలు నిర్వహించి.. వారు డైరెక్టర్లుగా ఉన్న ఇతర కంపెనీల పత్రాలతో పాటు కీలక పత్రాలకు సంబంధించిన ఆడిటింగ్ ఫైళ్లు, ఇతర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. షెల్ కంపెనీలను ఉపయోగించి నిధుల మళ్లింపులు జరిగాయని సీఐడీ గుర్తించింది.