శవ దహనానికి రూ. 5వేలు.. ఏలూరు నగరపాలకసంస్థలో తీర్మానం..
అంత్యక్రియల కోసం డబ్బులు వసూలు చేయాలని తీర్మానం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏలూరు నగరపాలక సంస్థలో ఈ మేరకు స్మశానాల్లో దహనానికి డబ్బులు వసూలు చేయాలని తీర్మానించారు.
అమరావతి : చనిపోయిన తర్వాత మృతదేహాన్ని కాల్చడానికి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. పేద ధనిక భేదం లేకుండా స్మశానాల్లో దహనం చేయాలంటే రూ.5వేలు సమర్పించుకోవాల్సిందే. ప్రతి మృతదేహానికి ఈ సొమ్ము చెల్లిస్తే కానీ ముక్తి లభించదు. పట్టణ, స్థానిక సంస్థలు వివిధ పౌర సేవలకు డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే దహన సంస్కారాలకు కూడా రేటు నిర్ణయించాయి. తాజాగా ఏలూరు నగరపాలక సంస్థలో స్మశానలకు వచ్చే మృతదేహాలను దహనం చేయడానికి రూ.5వేలు వసూలు చేయాలని నగరపాలక సంస్థ పాలక వర్గం నిర్ణయించింది. ఈ రుసుములో కట్టెలు, డీజిల్ లేదా పెట్రోలు ఖర్చులు కలిసి ఉంటాయి.
డిసెంబర్ 13న ఏలూరు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశ ఎజెండాలో 53వ అంశంగా స్మశానంలో దహనాల మీద డబ్బు వసూలు చేయాలనే విషయం ఉంది. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. సామాజిక బాధ్యతగా.. చట్టపరంగా పట్టణ, స్థానిక సంస్థలు ఆ ప్రాంతంలోని ప్రజలకు కొన్నిసేవలను ఉచితంగా అందించాల్సి ఉంటుంది. మరికొన్ని సేవలపై నామమాత్రంగా రుసుము వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా పురపాలక సంస్థలు, నగర పాలక సంస్థలు వ్యవహరిస్తున్నాయి. ధనార్జనే లక్ష్యంగా ప్రజల నుంచి భారీగా పన్నులు, ఇతర రుసుములు వసూలు చేస్తున్నాయి. కొన్ని సేవలపై ఖర్చుకు అయ్యే మొత్తం డబ్బులను ప్రజల నుంచే రాబట్టాలని చూస్తున్నాయి.
అలాంటిదే స్మశానంలో దహనానికి డబ్బులు వసూలు చేయడం. కరోనాకు ముందువరకు అనేక ప్రాంతాల్లోని స్మశానాల్లో కట్టెల కోసం ఖర్చు రూ. 1000 నుంచి రూ. 1500 వరకు వసూలు చేసేవారు. అది కూడా అధికారికంగా కాదు. అనధికారికంగా.. వీటికి ఎలాంటి బిల్స్, ఆధారాలు ఉండవు. అందుకే కోవిడ్ సమయంలో కాటికాపర్లు ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడ్డారు. దీని మీద అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ అధికారులు ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు వారే అధికారికంగా ధరలు నిర్ణయించి బోర్డులు పెట్టారు.
ఈ బోర్డుల ప్రకారం విశాఖపట్నంలో రూ.3000నుంచి రూ. 3,500, విజయవాడలో రూ.2,200నుంచి రూ.2,700.. గా వసూలు చేస్తున్నారు. ఇక ఈ రుసుము ఇతర ఇతర నగరాల్లో రూ 2,000నుంచి రూ.2,500 వరకు వసూలు చేస్తున్నారు. రుసుములు, పన్నుల పేరుతో ప్రజల నుంచి భారీ స్థాయిలో డబ్బులు వసూలు చేస్తున్న నగరపాలక సంస్థలు దహన ఖర్చులకు డబ్బులు వసూలు చేయడం విమర్శలకు తావిస్తోంది. దహన ఖర్చులు భరించడం భారమా? అంటూ పౌర సంఘాలు నగరపాలక సంస్థలను ప్రశ్నిస్తున్నాయి. ఇది నిరుపేద కుటుంబాలకు తలకుమించిన భారంగా మారుతుందని ప్రజాసంఘాల నేతలు మండిపడుతున్నారు.
స్మశానాల్లో దహన ఖర్చుల కోసం డబ్బులు వసూలు చేయాలని ఏకంగా నగరపాలక సంస్థలో తీర్మానం చేయడం దారుణమైన విషయం అని ఏలూరు పట్టణ పౌర సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ సిహెచ్ బాబూరావు ఆందోళన వ్యక్తం చేశారు. చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించడం కోసం అయ్యే ఖర్చు భరించడం స్థానిక సంస్థల చట్టపరమైన బాధ్యత. అంతేకాదు కాటి కాపరుల జీతాలను కూడా పురపాలక సంస్థలు, నగరపాలక సంస్థలే భరించాలి. ఏలూరు నగరపాలక సంస్థలో చేసిన తీర్మానాన్ని తక్షణం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.