తలపై కొట్టి.. పురుషాంగం కోసేసి..
పలు కేసుల్లో అరెస్టు అయ్యి రిమాండ్ కి కూడా వెళ్లాడు. టూటౌన్ పోలీసు స్టేషన్ లో రౌడీ షీటర్ గా నమోదైన ఇతనిపై విశాఖ నగరంలోని వివిధ స్టేషన్లలో కేసులు ఉన్నాయి.
విశాఖపట్నం నగరంలో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు ఆ రౌడీ షీటర్ పై దాడి చేసి.. తలపై రాడ్లతో కొట్టి... ఆ తర్వాత పురుషాంగం కోసేసి.. అతి కిరాతకంగా హత్య చేశారు. కాగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...
వైజాగ్ కి చెందిన గనగళ్ల శ్రీను చిన్న చిన్న దొంగతనాలు, ఇనుప తుక్కు దొంగిలించడం లాంటివి చేసేవాడు. పలు కేసుల్లో అరెస్టు అయ్యి రిమాండ్ కి కూడా వెళ్లాడు. టూటౌన్ పోలీసు స్టేషన్ లో రౌడీ షీటర్ గా నమోదైన ఇతనిపై విశాఖ నగరంలోని వివిధ స్టేషన్లలో కేసులు ఉన్నాయి.
13ఏళ్ల క్రితం భార్యతో గొడవపడి వేరేగా ఉంటున్నాడు. ఇనుప చెత్త ఏరి పైడిమాండ ఆలయం సమీపంలోని దుకాణంలో అమ్మి, ఆ డబ్బులతో నిత్యం మద్యం తాగుతూ అక్కడే తిరుగుతుంటాడు. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆ దుకాణం వద్దే గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడిచేసి హత్య చేసి పరారయ్యారు.
సంఘటన స్థలంలో ఓ చిన్న కత్తి, రక్తచారలతో ఉన్న ఓ కర్ర, ఓ రాయి ఉన్నాయి. అక్కడ మూడు ఖాళీ మద్యం సీసాలు ఉన్నాయి. దీనిని బట్టి గనగళ్ల శ్రీను మరో ఇద్దరితో మద్యం తాగి ఉంటాడని.. ఆ తర్వాత వారు అతనిని హత్య చేసి పరారై ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గురువారం ఉదయం స్థానికులు శ్రీను అన్నయ్య కుమారుడు ధన రాజ్ కు చెప్పడంతో అతను కంచరపాలెం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పాతకక్షలు, వివాహేతర సంబంధం నేపథ్యంలోనైనా హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనాస్థలాన్ని కంచరపాలెం సీఐ కృష్ణా రావు సందర్శించి పరిశీలించారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. కొంత మంది అనుమానితులను స్టేషన్ కు పిలిపించి విచారణ చేపట్టారు.