ప్రకాశం: పెళ్లికూతురును తీసుకువెళ్తుండగా రోడ్డుప్రమాదం... నలుగురు మృతి
పెళ్లి బాజా మోగాల్సిన ఇంట్లో రోడ్డు ప్రమాదం కారణంగా చావు భాజా మోగిన విషాద ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లికూతురు ప్రయాణిస్తున్న వాహనంలోంచి జారిపడి నలుగురు మరణించారు.
ప్రకాశం: కొన్ని గంటల్లో పెళ్లి. వధువును తీసుకుని కుటుంబసభ్యులు, బంధువులు ఆటోలో పెళ్లివారింటికి బయలుదేరారు. ఇలా ఆనందోత్సాహాల మధ్య సాగుతున్న వారి ప్రయాణంలో ఒక్కసారిగా కుదుపు. వేగంగా వెళుతున్న ఆటోలోంచి జారిపడి ఏకంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం మండలం సోమేపల్లికి చెందిన అమ్మాయికి పొదిలి అక్కచెరువుకు చెందిన అబ్బాయితో పెళ్లి నిశ్చయమయ్యింది. బుధవారం ఉదయం 11గంటలకు అబ్బాయి గ్రామంలో పెళ్లి జరగాల్సి వుంది. ఇందుకోసం ఇవాళ ఉదయమే సోమేపల్లి నుండి ఆటోలో పెళ్లికూతురిని తీసుకుని కుటుంబసభ్యులు పెళ్లివారింటికి బయలుదేరారు.
read more చిన్న పిల్లల అశ్లీల వీడియో.. ముగ్గురి అరెస్ట్
మరికొద్దిసేపట్లో పెళ్లివారింటికి చేరుకుంటారనగా ఒక్కసారిగా ఈ పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పింది. తర్లుపాడు- కొనకనమిట్ల మండలాల సరిహద్దు కలుజువ్వలపాడు జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న ఆటోలోంచి నలుగురు జారి కిందపడ్డాడు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరు హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. మృతులు కనకం కార్తీక్, అనిల్, బోగాను సుబ్బారావు, శ్రీనుగా గుర్తించారు.
పెళ్లికూతురు ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.