ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ప్రైవేట్ బస్సును ఢీ కొన్న లారీ, ఒకరు మృతి, 20మందికి గాయాలు
రోడ్డు ప్రమాదం ఒకరిని బలిగొంది. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో మరో 20మందికి గాయాలయ్యాయి. ప్రైవేట్ బస్సును లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ప్రకాశం : ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పూసలపాడు దగ్గర ఘోర road accident జరిగింది. ఒక ప్రైవేటు బస్సు లారీ, ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇరవై మందికి గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను దగ్గర్లోని కుంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, లారీని ఢీకొన్న bus రోడ్డు మీద అడ్డంగా పడడంతో జాతీయ రహదారి మీద రెండు వైపులా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో, అధికారులు బస్సును క్రేన్ సహాయంతో తొలగిస్తున్నారు. బస్సు విజయవాడ నుంచి అనంతపురం వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కాగా, జూన్ 27న నిజామాబాద్ జిల్లాలోని వేల్పూరు క్రాస్ రోడ్డు వద్ద ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదమే జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు సజీవదహనం అయ్యారు. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. ఆ ధాటికి వెంటనే కారులో మంటలు చెలరేగాయి. దీంతో, కారులో చిక్కుకుపోయిన ఇద్దరు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతులిద్దరినీ జగిత్యాల జిల్లా వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం... ముంబై వాసులిద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
ఇక జూన్ 25న నంద్యాలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవరుడు మృతి చెందాడు. నంద్యాల జిల్లా వెలుగోడు మండలం పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లైన కొన్ని గంటలు కూడా గడవకముందే నవ వరుడు శివకుమార్ మృతి చెందారు. ఈ ఘటన జూన్ 25, శనివారం తెల్లవారుజామున జరిగింది. ఆ సమయంలో అతను రోడ్డు మీద వెడుతుండగా వెలుగోడు మండలంలోని మోత్కూరు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో శివకుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు. వివాహం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే శివకుమార్ చనిపోవడం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.