జోరు వానలో ఘోర ప్రమాదం... ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై వెళుతుండగా ప్రమాదం జరగడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
విజయవాడ: జోరుగా కురుస్తున్న వానలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వైపు వెళుతున్న బైక్ ప్రమాదానికి గురయి ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయాలపాలై హాస్పిటల్ లో కొనఊపిరితో చికిత్స పొందుతున్నాడు.
సూర్యాపేట జిల్లా కోదాడ నుండి కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటకు ముగ్గురు వ్యక్తులు బైక్ పై బయలుదేరారు. జోరున కురుస్తున్న వర్షంలోనే వారు ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యారు. గరికపాడు చెక్ పోస్ట్ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న బైక్ రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా మరొకరు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.
read more ఇష్టపడ్డ యువతి కరోనాతో మృతి.. మనస్తాపంతో ఆ ప్రియుడు చేసిన పని..
జోరు వర్షంలో ప్రమాదం జరగడంతో గాయపడిన వ్యక్తికి సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో అతడు రోడ్డుపైనే కొద్దిసేపు గిలగిల్లాడిపోయాడు. అయితే ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రున్ని అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. అలాగే మృతదేహాలను కూడా ఓ వాహనంలో హాస్పిటల్ కు తరలించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ప్రమాదానికి గల కారణాలను గుర్తించేపనిలో పడ్డారు. భారీ వర్షంలో తడుస్తూనే సహాయక చర్యలు చేపట్టిన పోలీసులను స్థానికులు అభినందిస్తున్నారు.